ప్రముఖ ఫుడ్‌ డెలివరీ ప్లాట్‌ఫామ్‌ జొమాటో యూజర్లకు మరో షాకిచ్చింది.

..భారత్ న్యూస్ హైదరాబాద్….ప్రముఖ ఫుడ్‌ డెలివరీ ప్లాట్‌ఫామ్‌ జొమాటో యూజర్లకు మరో షాకిచ్చింది. నష్టాల్ని తగ్గించుకొనే ప్రయత్నంలో భాగంగా కొత్త ఛార్జీల బాదుడు మొదలు పెట్టింది. దూరానికి అనుగుణంగా ‘లాంగ్‌ డిస్టెన్స్‌ సర్వీస్‌ ఫీజు’ను ప్రారంభించింది. అంటే ఇకపై దూరంగా ఉన్న హోటల్‌/రెస్టరంట్‌ నుంచి ఫుడ్‌ ఆర్డర్‌ చేస్తే ఆ మేరకు ఛార్జీలు ఉంటాయన్నమాట. 
4 కిలోమీటర్ల వెలుపల ఉన్న రెస్టరంట్ల నుంచి పెట్టే ఆర్డర్లకు జొమాటో ‘లాంగ్‌ డిస్టెన్స్‌ సర్వీస్‌ ఫీజు’ వర్తిస్తుంది. రెస్టరంట్‌, డెలివరీ అడ్రస్‌ మధ్య దూరం 4 నుంచి 6 కిలోమీటర్ల మధ్య ఉంటూ ఆర్డర్‌ విలువ రూ.150 దాటితే కస్టమర్లకు రూ.15 వసూలు చేయనున్నారు. అదే 6 కిలోమీటర్ల పరిధి దాటితే ఆర్డర్‌ విలువతో సంబంధం లేకుండా నగరాన్ని బట్టి సర్వీస్‌ ఛార్జి రూ.25 నుంచి రూ.35 వరకు ఉంటుంది.
కొవిడ్‌ విజృంభనకు ముందు జొమాటో 4 నుంచి 5 కిలోమీటర్ల పరిధి వరకు ఉన్న దూరానికి ఎలాంటి ఛార్జీలు విధించేది కాదు. మహమ్మారి తర్వాత అనేక రెస్టరంట్లు తాత్కాలికంగా మూతపడిన సమయంలో ఆ డెలివరీ పరిధిని 15 కిలోమీటర్ల వరకు పెంచింది. తర్వాత క్రమంగా తగ్గించుకుంటూ వచ్చింది. డెలివరీ ఫీజును మొదలుపెట్టింది. ఇప్పుడు దూరాన్ని బట్టి ఫీజు వసూలుచేయాలని నిర్ణయించింది. అయితే, డిస్టెన్స్‌ ఛార్జీ, సర్వీసు ఛార్జీ ఆర్డర్‌ విలువకు 30 శాతం మించకుండా చూసుకోవాలని రెస్టరంట్‌ పార్టనర్‌లకు జొమాటో సూచించింది.మరోవైపు జొమాటో తన క్విక్‌ కామర్స్‌ విభాగమైన బ్లింకిట్‌పై పెద్దఎత్తున ఖర్చు చేస్తోంది. దీంతో నష్టాలను మూటగట్టుకుంటోంది. ఈ క్రమంలోనే  నష్టాలను తగ్గించుకొనే ప్రయత్నంలో భాగంగా పలు చర్యలు చేపడుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ప్లాట్‌ఫామ్‌ ఫీజును వసూలుచేస్తున్న ఈ కంపెనీ తాజాగా.. జొమాటో గోల్డ్‌ చందాదారులకు రెయిన్‌ సర్‌ఛార్జీ మినహాయింపును తొలగించింది. ఈ వార్తల నేపథ్యంలో నేడు ట్రేడింగ్‌ సెషన్‌లో జొమాటో షేర్లు లాభాల్లో ట్రేడవుతున్నాయి. 12:40 గంటల సమయంలో ఎటర్నల్‌ (జొమాటో) షేర్లు ఎన్‌ఎస్‌ఈలో 4.20 శాతం లాభంతో రూ.237.55 వద్ద కొనసాగుతున్నాయి.