తెలంగాణలో బీసీ కులాల పేర్లు మార్పు.. కొత్త పేర్లు ఇవే!

భారత్ న్యూస్ వరంగల్ …తెలంగాణలో బీసీ కులాల పేర్లు మార్పు.. కొత్త పేర్లు ఇవే!

BC Caste Names Change: తెలంగాణలోని వెనుకబడిన తరగతుల (బీసీ) చిరకాల వాంఛను నెరవేరుస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఒక కీలకమైన సామాజిక సంస్కరణకు శ్రీకారం చుట్టింది.

సమాజంలో కించపరిచే విధంగా ఉన్న కొన్ని కులాల పేర్లను తొలగించి, వాటి స్థానంలో గౌరవప్రదమైన పేర్లను చేరుస్తూ రాష్ట్ర కేబినెట్ ఆమోద ముద్ర వేసింది. బీసీ కమిషన్ సమర్పించిన నివేదిక ఆధారంగా తీసుకున్న ఈ నిర్ణయం వల్ల ఆయా వర్గాల ఆత్మగౌరవం పెరుగుతుందని ప్రభుత్వం భావిస్తోంది. ఈ మార్పులు తక్షణమే రాష్ట్ర గెజిట్ ద్వారా అధికారిక రికార్డుల్లోకి రానున్నాయి.

BC Caste Names Change: బీసీ గ్రూప్-ఏలో విప్లవాత్మక మార్పులు

ప్రభుత్వం చేపట్టిన ఈ మార్పుల్లో బీసీ గ్రూప్-ఏ విభాగంలో అత్యధిక మార్పులు జరిగాయి. ముఖ్యంగా వినడానికి అసభ్యకరంగా ఉన్న పదాలను రికార్డుల నుంచి పూర్తిగా తొలగించారు.

దొమ్మర: ఈ పేరును తొలగించి ‘గడ వంశీయ’గా మార్చారు.
పిచ్చకుంట్ల: ఇకపై ఈ కులస్తులను ‘వంశ రాజ్’గా వ్యవహరిస్తారు.
బుడబుక్కల: వీరికి ‘శివ క్షత్రియ’ అనే గౌరవప్రదమైన పదాన్ని జోడించారు.
వీరభద్రియ: వీరి కోరిక మేరకు ‘వీరముష్టి, నెట్టి కోటల’ అనే పదాలను పర్యాయపదాలుగా చేర్చారు.
వన్నార్:_ ఈ పదాన్ని తొలగించి, రజక/చాకలి వర్గాల కోసం ‘ధోబీ’ అనే పదాన్ని ఖరారు చేశారు.
గ్రూప్-డిలో ‘శూద్ర’ పదం తొలగింపు

బీసీ గ్రూప్-డి విభాగంలో కూడా ప్రభుత్వం సామాజిక స్పృహతో పలు మార్పులు చేసింది. ఎప్పటి నుంచో వివాదాస్పదంగా ఉన్న ‘శూద్ర కులం’ అనే పదాన్ని అధికారిక రికార్డుల నుంచి పూర్తిగా తొలగించారు. ఆ స్థానంలో ‘తమ్మలి (బ్రాహ్మణేతర)’గా పేరు మారుస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. దీనివల్ల ఆ వర్గానికి స్పష్టమైన సామాజిక గుర్తింపు లభిస్తుంది. అలాగే వరుస సంఖ్య 5లో ఉన్న ‘మేర’, ‘చిప్పోలు‘ కులాలకు అదనంగా ‘మేరు’ అనే పదాన్ని చేర్చారు.

విద్యార్థులు, ఉద్యోగార్థులకు మేలు

ఈ నిర్ణయం వల్ల భవిష్యత్తులో విద్యార్థులు, ఉద్యోగార్థులు తమ కుల ధ్రువీకరణ పత్రాల్లో (Caste Certificates) గౌరవప్రదమైన పేర్లను పొందే అవకాశం కలుగుతుంది. సమాజంలో పిలిచేటప్పుడు కలిగే ఇబ్బందులను తొలగించి, ఆయా వర్గాల్లో ఆత్మవిశ్వాసాన్ని నింపడమే ఈ సంస్కరణ ముఖ్య ఉద్దేశమని బీసీ కమిషన్ వెల్లడించింది. కులాల పేర్ల మార్పుపై హర్షం వ్యక్తం చేస్తున్న బీసీ సంఘాలు, ఇది తమ సామాజిక హోదాను పెంచుతుందని అభిప్రాయపడుతున్నాయి.