Vaikuntha Ekadashi programs at Sri Kalyana Venkateswara Swamy Temple on 23rd December

డిసెంబ‌రు 23న శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామి ఆలయంలో వైకుంఠ ఏకాదశి కార్యక్రమాలు

తిరుమల( భారత్ న్యూస్ ) శ్రీనివాసమంగాపురం శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామి ఆలయంలో డిసెంబ‌రు 23న వైకుంఠ ఏకాదశి, 24న వైకుంఠ ద్వాదశి పర్వదినాల‌ సందర్భంగా ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనున్నారు.డిసెంబ‌రు 23న వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని వేకువజామున 12.05 గంటల నుండి 2.30 గంట వరకు ధనుర్మాస కైంకర్యాలు, తోమాల, కొలువు, పంచాంగ శ్రవణం ఏకాంతంగా నిర్వహిస్తారు. వేకువజామున 2.30 నుండి సాయంత్రం 4 గంటల వరకు భక్తులను సర్వదర్శనానికి అనుమతిస్తారు. ఉద‌యం 6 నుండి 7 గంట‌ల వ‌ర‌కు బంగారు తిరుచ్చిపై స్వామి, అమ్మ‌వార్లు ఆల‌య నాలుగు మాడ వీధుల్లో విహ‌రించి భ‌క్తుల‌ను క‌టాక్షించ‌నున్నారు.
సాయంత్రం 4 నుండి 5 గంటల వరకు రాత్రి కైంకర్యాలు తిరిగి సాయంత్రం 5 నుండి రాత్రి 9 గంటల వరకు భక్తులను స్వామివారి దర్శనానికి అనుమతిస్తారు అదేవిధంగా డిసెంబ‌రు 24న వైకుంఠ ద్వాదశి సంద‌ర్భంగా ఉద‌యం 4 నుండి 5.30 గంట‌ల వ‌ర‌కు ధనుర్మాస కైంకర్యాలు, ఉద‌యం 5.30 నుండి 7.30 గంట‌ల వ‌ర‌కు తోమాల, కొలువు, పంచాంగ శ్రవణం నిర్వహిస్తారు. ఉద‌యం 10 నుండి 11 గంట‌ల వ‌ర‌కు చ‌క్ర‌స్నానం నిర్వ‌హించ‌నున్నారు ఈ సందర్భంగా డిసెంబ‌రు 23, 24వ తేదీల్లో ఆర్జిత కల్యాణోత్సవం సేవను టీటీడీ రద్దు చేసింది. టీటీడీ హిందూ ధర్మప్రచార పరిషత్‌, అన్నమాచార్య ప్రాజెక్టుల ఆధ్వర్యంలో ఆలయంలో ఆధ్యాత్మిక, భక్తి సంగీత కార్యక్రమాలు నిర్వహించనున్నారు.