భర్తకు గుండెజబ్బు.. సెక్స్ కోరికలు తీర్చలేడని భార్య ఘాతుకం

భారత్ న్యూస్ రాజమండ్రి…భర్తకు గుండెజబ్బు.. సెక్స్ కోరికలు తీర్చలేడని భార్య ఘాతుకం

అనురాగ బంధానికి ఆ ఇల్లాలు మంగళసూత్రం సాక్షిగా ప్రమాణం చేసింది. కానీ, క్షణిక సుఖాల వ్యామోహంలో పడి ఆ పవిత్ర బంధాన్ని నడిరోడ్డుపై తెంచేసింది. అనారోగ్యంతో ఉన్నాడన్న జాలి కూడా లేకుండా, కట్టుకున్న భర్తను అత్యంత దారుణంగా కడతేర్చింది. గుండెపోటు మరణంగా కలరింగ్ ఇచ్చి తప్పించుకుందామనుకున్న ఆ కిరాతకురాలి పాపం ప్రియుడి ఎంట్రీతో కటకటాలపాలైంది. ఈ విషాద ఘటన కాకినాడ జిల్లా సర్పవరంలో తీవ్ర కలకలం రేపింది…

సర్పవరం సీఐ బి.ప్రకాష్‌ తెలిపిన వివరాల ప్రకారం.. కాకినాడ రూరల్ మండలం సర్పవరంలో మండపం కాలనీకి చెందిన పుల్ల దుర్గాప్రసాద్‌ (35) ఆటో నడుపుతూ భార్య రమాదేవి, ఇద్దరు కుమార్తెలతో కలిసి జీవనం సాగిస్తున్నాడు. రెండేళ్ల క్రితం దుర్గాప్రసాద్‌ గుండెలో స్టంట్లు వేయడంతో ఇంటికే పరిమితం అయ్యాడు. భర్త రోజురోజుకు అచేతనంగా మారుతుండటంతో భార్య రమాదేవి కోరికలు మితిమీరిపోయాయి. ఈ క్రమంలో బాపట్లకు చెందిన ప్రసాదం గోపిసాయితో #Instagram లో పరిచయమై, వివాహేతర సంబంధానికి దారితీసింది.అతడు తరచూ బాపట్ల నుంచి సర్పవరం వచ్చి రమాదేవిని తీసుకుని రామచంద్రపురం, విజయవాడ తదితర ప్రాంతాలకు షికారు తిప్పేవాడు.

భార్య వ్యవహారంపై అనుమానం వచ్చిన దుర్గాప్రసాద్‌ నిలదీసి మంచి పద్ధతి కాదని, ప్రవర్తన మార్చుకోవాలని మందలించాడు. తమకు అడ్డుగా ఉన్న భర్తను తొలగించుకునేందుకు ప్రియుడితో కలిసి పన్నాగం పన్ని నిద్రమాత్రలతో అంతమొందించాలని పథకం వేసింది. ప్రియుడు గోపిసాయి బాపట్ల నుంచి 15 నిద్ర మాత్రలు కొనుగోలు చేసి దేవికి ఇవ్వడంతో మార్చి 13న ఉదయం ఖర్జూర జ్యూస్‌లో వాటిని వేసి భర్తతో తాగించింది. అపస్మారక స్థితిలోకి వెళ్లిన భర్తను దిండుతో ముఖంపై అదిమి పట్టుకుని ఊపిరాడకుండా చేసి హత్య చేసింది. అనంతరం ఏమీ తెలియనట్లు భర్తకు గుండెపోటు వచ్చి పడిపోయాడని బంధువులకు చెప్పడంతో వారు ఆసుపత్రికి తీసుకెళ్లగా అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు. అనంతరం మృతదేహానికి అంత్యక్రియలు పూర్తి చేశారు.

అయితే భర్త చనిపోయి మూడు నెలలు గడవక ముందే రమాదేవి పాత ప్రియుడిని వదిలి.. కొత్త ప్రియుడిని వెతుక్కోవడంతో బాపట్ల బాబుకు కోపం వచ్చింది. అంతే.. ఈ నెల 9న ‘మీ అమ్మ జ్యూస్‌లో నిద్రమాత్రలు కలిపి ఇచ్చి ఊపిరాడకుండా చేసి మీ నాన్నను చంపేసింది’ అని రమాదేవి కుమార్తె ఫోన్‌కు గోపిసాయి మెసేజ్‌ చేశాడు. దీంతో హత్య వ్యవహారం బయటపడింది..