మాతృదినోత్సవం సందర్భంగా తల్లులంతా ఒకసారి తమ బాధ్యతలు గుర్తుంచుకోవాలి

భారత్ న్యూస్ తిరుపతి… మాతృదినోత్సవం సందర్భంగా తల్లులంతా ఒకసారి తమ బాధ్యతలు గుర్తుంచుకోవాలి

నేడు మాతృదినోత్సవం సందర్భంగా తల్లులంతా ఒకసారి తమ బాధ్యతలు గుర్తుంచుకోవాలి. పిల్లల్ని కడుపులో పెట్టుకు చూసే నాటి అమ్మలను ఆదర్శంగా తీసుకోవాలి.
కనిపించే దైవం అమ్మ. ఆత్మీయతకు, అనురాగానికి, త్యాగానికి చిరునామా అమ్మ.. ఆ పిలుపులోనే తీయదనం ఉంది. రెక్కలు ముక్కలు చేసుకుని మనల్ని పెంచి పెద్ద చేస్తుంది. బుడిబుడి అడుగుల నుంచే నడతను, ఆ తర్వాత భవితను నిర్దేశిస్తుంది. ఏ చిన్న తప్పుచేసినా కడుపులో దాచుకుని, కనికరిస్తుంది. కొడుకులు చెట్టంత ఎదిగి దూర తీరాలకేగినా… బిడ్డలు అత్తవారిళ్లకు వెళ్లినా ఆ తల్లి హృదయం వారి క్షేమం కోసం పరితపిస్తూనే ఉంటుంది. కన్నపేగుకు ఏచిన్న కష్టమొచ్చినా తల్లడిల్లిపోతుంది. ఇలా తమ కోసం సర్వస్వం ధారపోసి, పెంచి పెద్దచేసిన తల్లులను వారి జీవిత చరమాంకంలో కళ్లల్లో పెట్టుకుని కాపాడడం ప్రతి ఒక్కరి ధర్మం.

‘‘నేడు ప్రపంచ మాతృ దినోత్సవం’’ సందర్భంగా ప్రత్యేక కథనం..
‘‘అమ్మ పునర్జన్మనెత్తుతూ బిడ్డకు జన్మనిస్తుంది. పొత్తిళ్లలో పసికందును చూసి ప్రసవవేదనను మరిచిపోతుంది. ఏడిస్తే స్తన్యమిచ్చి ఆకలితీరుస్తుంది. బుజ్జగిస్తూ బువ్వపెట్టి, జోలపాడి నిద్రపుచ్చుతుంది. తన త్యాగపు పునాదులపై మన బతుకు సౌదాన్ని నిర్మించిన ఆ మాతృమూర్తికి ఏమిచ్చి రుణం తీర్చుకోగలం.. కదిలే దేవతకు ఎలా కృతజ్ఞతలు చెప్పగలం…’’

అన్ని బంధాలకు వారధి కుటుంబ వ్వవస్థకు సారథిగా ఉంటూ తన పిల్లలు ఉన్నత స్థానాల్లో ఉండాలని ప్రతి తల్లి కోరుకుంటుంది. ఎన్ని బాధ్యతలు ఉన్న తప్పున చేసిన పిల్లలను మొదట్లో దండిస్తూ సన్మార్గంలో నడిపిస్తూ కుటుంబ వారథిగా, సారథి తల్లి.

బిడ్డల బాగుకోరుతూ, తను కష్టాలు పడుతూ వారిని కంటిరెప్పలగా కాపాడుకుంటూ ఎల్లప్పుడూ వారికి అండగా ఉంటున్న అమ్మకు మదర్సే డే సందర్భంగా హ్యట్సాఫ్‌…

మాతృదేవతాౖయె నమః…

ప్రేమ, కరుణలను వర్షించే ప్రేమమూర్తులుగా మాతృత్వమనే పదానికే అర్థంగా, నిదర్శనంగా నిలిచిన తల్లులు మన పురాణాల్లో ఎంతోమంది కనిపిస్తారు. అలాంటివారిలో… తలచుకోగానే బొమ్మకట్టే కొందరు మాతృమూర్తుల గురించి తెలుసుకుందాం.

పార్వతీదేవి: ఆమె అమ్మల గన్న అమ్మ, శక్తి స్వరూపిణి, తన బిడ్డ ప్రాణం కోసం పతి అయిన పరమ శివుడినే ఎదిరించి, ఆయనతో పోరాడి మరీ బిడ్డను బతికించుకున్న మాతృమూర్తి. తాను నలుగుపిండితో ప్రాణం పోసిన బాలుడికి, తన భర్త అయిన శంకరుడికి మధ్య జరిగిన పోరాటంలో ఆ బిడ్డ ప్రాణాలు కోల్పోయాడని తెలిసి భోరున విలపించింది. తొందరపడి బిడ్డను పొట్టన పెట్టుకున్నాడని ప్రాణనాథుడైన పరమేశ్వరుడినే ఒక సాధారణ స్త్రీలా తూలనాడిన సిసలైన తల్లి ఆమె. ఏనుగు తలైనా ఫరవాలేదు పిల్లవాడు ప్రాణాలతో తిరుగాడితే చాలు అని ఆరాటపడిన అసలైన అమ్మ. ఆ బిడ్డడే అందరి తొలి పూజలందుకునే బొజ్జ గణపయ్య.

సీతాదేవి: శ్రీరాముడి పత్ని అయిన సీతాదేవి గర్భిణిగా తనను అడవిలో వదిలేసినప్పటికీ, ఆ బాధను, శోకాన్ని దిగమింగుకుని వాల్మీకి ఆశ్రమంలో కవలలు లవకుశులకు జన్మనిచ్చింది. ఎన్ని కష్టనష్టాలెదురైనా తన కుమారులిద్దరినీ క్షత్రియపుత్రులు, ఇక్ష్వాకు వంశ వారసులుగా ఒంటరిగా పెంచి పెద్ద చేసింది.

యశోదాదేవి: దేవకీ నందనుడైన కన్నయ్యను తన ప్రేమ, వాత్సల్యాలతో యశోదా కృష్ణుడిగా మార్చుకున్న ప్రేమమయి యశోదాదేవి. కన్నది దేవకీ దేవి అయినా కృష్ణుడి బాల్యం అనగానే మనకు చటుక్కున స్ఫురించేది యశోదాదేవి పేరే. పాలు, వెన్నలతోపాటు ప్రేమ, వాత్సల్యాలను, మమతానురాగాలను కూడా రంగరించి కృష్ణుడిని పెంచి పెద్ద చేసింది. కన్నయ్య ఆడితే ఆనందపడిపోయి, పాడితే పరవశించిపోయి, పిల్లనగ్రోవి ఊదితే మైమరచిపోయి అల్లరి చేస్తే ముద్దుగా కోప్పడి… ఇలా అతని బాల్యక్రీడలతో, అల్లరిచేష్టలతో మాతృత్వాన్ని తనివి తీరా ఆస్వాదించిన తల్లి.. యశోదమ్మ. అయితే అన్న అయిన కంసుడి క్రౌర్యానికి వెరచి పొత్తిళ్లలోనే బిడ్డను వేరొకరికి అప్పగించవలసిన అగత్యం ఏర్పడినా ఎక్కడో ఒకచోట తన బిడ్డ క్షేమంగా ఉంటే చాలని పుట్టెడు శోకాన్ని గుండెల్లోనే దాచుకున్న దేవకీదేవి కూడా స్మరణీయురాలే..

కౌసల్యాదేవి: దశరథ రాజు పట్టపురాణి, రామచంద్రుడి తల్లి కౌసల్యాదేవి. సవతి కైకేయికి భర్త ఇచ్చిన వరం మూలంగా పద్నాలుగేళ్ల పాటు తన పుత్రుడికి దూరమై తీవ్ర వేదనను అనుభవించిన మాతృమూర్తి. భర్త నిస్సహాయత, కైకేయి దురాలోచన ఫలితంగా రాముడు వనవాసానికి వెళ్లి తాను శోకంలో మునిగిపోయినప్పటికీ తనయుడి పితృవాక్య పరిపాలనకు లోటు రాకూడదన్న సదాశయంతో, సయమనంతో వ్యవహరించిన తల్లి కౌసల్యాదేవి.

సుమిత్రాదేవి: భర్త దశరథుడు కైకేయికి ఇచ్చిన వరమే తన పాలిట శాపం కాగా పుత్రుడి ఎడబాటును ఏళ్లతరబడి మౌనంగా భరించిన తల్లి సుమిత్ర. అన్నతోపాటు తాను కూడా వనవాసానికి వెళతానంటూ లక్ష్మణుడు పట్టుబట్టిన వేళ… అతడిని వారించకుండా రాముడిని కూడా తన కుమారుడిలాగే భావించి అతడి పితృవాక్యపరిపాలనకు తన వంతు సహకారాన్ని అందించిన సహృదయురాలు సుమిత్రాదేవి.

కైక: పేరుకు భరతుడు తన పుత్రుడైనా రాముడినే తన బిడ్డగా భావించి అపరిమితమైన ప్రేమ, వాత్సల్యాలతో అల్లారుముద్దుగా రామచంద్రుడిని పెంచింది. అనుక్షణం రాముడినే కలవరించి, పలవరించేది. అలాంటిది మంధర చెప్పుడు మాటలు విని తన కుమారుడు భరతుడి భవిష్యత్తుకోసం రాముడిని వనవాసానికి పంపింది. ఫలితంగా కన్నకొడుకే తనను చూసి ఛీత్కరించుకుంటే ఎంతగానో ఏడ్చింది. ఆ తరువాత ఎంతో పశ్చాత్తాప పడ్డ కైక కూడా గుర్తుచేసుకోదగిన తల్లే.

వకుళమాత: శ్రీకృష్ణుడి బాల్యం మాత్రమే తాను చూడగలిగానని అనంతరం అతని వద్ద ఉండలేకపోయానని వాపోయిన యశోదమ్మకు మరుజన్మలో ఆ అవకాశం కల్పిస్తానని వాగ్దానం చేశాడు కృష్ణుడు. అన్నట్లుగానే యశోదమ్మ, వకుళమాతగా జన్మించగా తాను శ్రీనివాసుడిగా అవతరించి పుత్రుడిగా ఆమె ప్రేమను అందుకున్నాడు కృష్ణుడు. పూర్వజన్మలో తాను కోరిన కోరికను ఈ జన్మలో నెరవేర్చేందుకు పుత్రుడిగా తన వద్దకు ఏతెంచిన గోవిందుడిని వాత్సల్యంతో ఆదరించి తనలోని మాతృత్వభావనను పరిపూర్ణం చేసుకున్న మాతృమూర్తి వకుళమాత.