భారత్ న్యూస్ హైదరాబాద్….రాష్ట్రంలో విద్యుత్ పంపిణీ వ్యవస్థలకు సంబంధించి ప్రస్తుతం ఉన్న రెండు డిస్కంలను మూడు డిస్కంలుగా పునర్విభజన చేయాలని ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారు అధికారులను ఆదేశించారు. మంత్రిమండలి ఆమోదం తర్వాత మూడో డిస్కంపై ముందుకు వెళ్లాలని చెప్పారు.
ఇందన శాఖపై ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి శ్రీ మల్లు భట్టి విక్రమార్క గారితో కలిసి ఇంధన శాఖ, సంబంధిత శాఖల ఉన్నతాధికారుల సమావేశంలో సుదీర్ఘంగా సమీక్షించారు. మూడవ డిస్కం ఏర్పాటుకు వీలైనంత తొందరగా పూర్తిస్థాయి ప్రణాళికను సిద్ధం చేయాలని, సంబంధిత పీపీఏ అలొకేషన్, సిబ్బంది, ఆస్తుల విభజన, బకాయిలు, ఇతర అంశాలపై ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారు అధికారులకు పలు సూచనలు చేశారు.
రాష్ట్రంలో సదరన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ (TGSPDCL) , నార్తర్న్ పవర్ డిస్ట్రిబ్యూషన్ (TGNPDCL) లతో పాటు మరో డిస్కం ఏర్పాటు ప్రతిపాదనలపై ఇంధన శాఖ సిద్ధం చేసిన ప్రాథమిక ప్రణాళికను అధికారులు ముఖ్యమంత్రి గారికి వివరించారు.
వ్యవసాయం, మేజర్, మైనర్ లిఫ్ట్ ఇరిగేషన్, గ్రామీణ మంచినీటి సరఫరా, జీహెచ్ఎంసీ పరిధిలో మంచినీటి సరఫరాకు సంబంధించిన విద్యుత్ వినియోగాన్ని కొత్త డిస్కం పరిధిలోకి తేవాలన్న ప్రతిపాదనలను వివరించారు.
గ్రేటర్ హైదరాబాద్లో అండర్ గ్రౌండ్ విద్యుత్ కేబులింగ్ విధానంపై పలు ప్రతిపాదనలు, డీపీఆర్ తయారీకి సంబంధించిన అంశాలను ముఖ్యమంత్రి గారికి వివరించారు. వీటితో పాటు కోర్ అర్బన్ రీజియన్లో విద్యుత్ సబ్ స్టేషన్లను అధునీకరించే అంశాలను తెలియజేశారు.
వచ్చే రెండున్నరేళ్లలో కోర్ అర్బన్ రీజియన్లో అండర్ గ్రౌండ్ కేబులింగ్ పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారు పలు సూచనలు చేశారు.
కోర్ అర్బన్ రీజియన్లో ఎక్కడెక్కడ కొత్త విద్యుత్ సబ్ స్టేషన్ల అవసరం ఉందో గుర్తించాలి.
ఓవర్ లోడ్ సమస్య తలెత్తకుండా లోడ్ రీప్లేస్మెంట్ చర్యలు చేపట్టాలి.
సబ్ స్టేషన్ సామర్థ్యంకన్నా ఒక్క కనెక్షన్ కూడా ఎక్కువ ఉండకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.
అవసరమైన చోట సబ్ స్టేషన్ సామర్థ్యాన్ని పెంచుకోవాలి.
విద్యుత్ సబ్ స్టేషన్లలో అధునాతన సాంకేతికతను ఉపయోగించాలి.
విద్యుత్ కేబుళ్లతో పాటు ఇతర కేబుళ్లు సైతం అండర్ గ్రౌండ్ వ్యవస్థను ఉపయోగించుకునేలా ఉండాలి.
దీనిపై బెంగుళూరుతో పాటు ఇతర రాష్ట్రాల్లో అండర్ గ్రౌండ్ కేబులింగ్ ప్రాజెక్టులను అధ్యయనం చేయాలి.
వచ్చే డిసెంబర్లోగా ఈ ప్రాజెక్టుకు సంబంధించి పూర్తిస్థాయి ప్రణాళికలు రూపొందించాలి.
