సింగరేణి గుర్తింపు ఎన్నికలలో ఎఐటియుసికి పట్టం కట్టిన ప్రతి ఒక్క కార్మికుడికి కృతజ్ఞతలు.
సింగరేణి సంపదను కాపాడుకుంటాం
సంపదను డైవర్ట్ చేసి దుర్వినియోగం చేసిన అధికారులపై న్యాయవిచారణ చేయాలి
ప్రతి కార్మికుడికి సొంత ఇళ్ళు, ఇతర సౌకర్యాల కల్పనకు కృషి.
-కూనంనేని సాంబశివ రావు, వాసిరెడ్డి సీతారామయ్య, రాజ్కుమార్.
సింగరేణి గుర్తింపు ఎన్నికలలో ఎఐటియుసికి పట్టంకట్టిన సింగరేణి కార్మికులకు సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ గౌరవాధ్యక్షులు కూనంనేని సాంబశివరావు, అధ్యక్షులు వాసిరెడ్డి సీతారామయ్య, ప్రధాన కార్యదర్శి రాజ్కుమార్ అభినందనలు తెలియజేశారు. కష్టకాలంలో సింగరేణిని బ్రతికుంచుకోవాలనే పట్టుదలతో పోరాటాల సంఘమైన ఎఐటియుసికి వేలాది మంది ఓట్లు వేసి సుమారు మూడు వేల మెజారిటీతో గెలిపించారని, వారందరికి కృతజ్ఞతలన్నారు. సింగరేణి పరిధిలో కొత్తమైన్స్ను తీసుకరావడానికి కృషి చేస్తామని వారు ఈ సందర్భంగా తెలియజేశారు. దానికి ప్రభుత్వం నుండి కూడా పూర్తి సహకారం అందించాలని వారు కోరారు. మైన్స్ ప్రైవేట్పరం కాకుండా సింగరేణి పరిధిలోనే ఉండేవిధంగా పోరాటం చేస్తామని తెలియజేశారు. ప్రతి కార్మికుడికి సొంత ఇళ్లు సౌకర్యం కోసం కృషి చేస్తామని పేర్కొన్నారు. సింగరేణి సంపదను దారిమళ్లించి, దుర్వినియోగం చేసిన సింగరేణి చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఇతర అధికారులపైన న్యాయవిచారణ చేయాలని వారు డిమాండ్ చేశారు. సింగరేణి సంపద తరలిపోకుండా కాపాడుకుంటామని వారన్నారు. గుర్తింపు ఎన్నికలలో ఎఐటియుసి విజయానికి పాటుపడిన ప్రతిఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేశారు.