భారత్ న్యూస్ హైదరాబాద్,
హైదరాబాద్, డిసెంబర్ 5 : ఎల్బీస్టేడియంలో గురువారం జరగనున్న ముఖ్యమంత్రి ఎ రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారోత్సవానికి విస్తృత ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి అధికారులను ఆదేశించారు. ముఖ్యమంత్రి, మంత్రి మండలి ప్రమాణ స్వీకారోత్సవానికి సంబంధించి ఏర్పాట్లపై అధికారులతో సీఎస్ సమావేశం నిర్వహించి సమీక్షించారు.
అధికారులందరూ సమన్వయంతో పనిచేసి ప్రమాణస్వీకార కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సి.ఎస్ కోరారు. ప్రమాణస్వీకారానికి వచ్చే వారికి తగిన బందోబస్తు, ట్రాఫిక్, పార్కింగ్, భద్రతా ఏర్పాట్లు చేయాలని పోలీసు శాఖను ఆదేశించారు. అగ్నిమాపక యంత్రాలు, అగ్నిమాపక శకటాలను వేదిక వద్ద ఉంచాలి. వేదికను శుభ్రపరచడం, త్రాగు నీరు ఫాగింగ్ చేయడం వంటివి చేయాలని జీహెచ్ఎంసీ అధికారులను కోరారు. L.B.స్టేడియం వద్దకు వెళ్లే రహదారుల మరమ్మతులు చేపట్టాలని సూచించారు. అన్ని సౌకర్యాలతో కూడిన అంబులెన్స్ను ఏర్పాటు చేయాలని వైద్యారోగ్య శాఖను ఆదేశించారు. అదేవిధంగా అంతరాయం లేకుండా విద్యుత్ సరఫరా చేయాలని ఇంధన శాఖ అధికారులకు ఆదేశించారు.
ఈ సమావేశంలో డీజీపీ రవిగుప్తా, హైదరాబాద్ సీపీ సందీప్ శాండిల్యా, స్పెషల్ చీఫ్ సెక్రటరీ సునీల్ శర్మ, ప్రిన్సిపల్ సెక్రటరీలు S.A.M రిజ్వీ, శైలజా రామయ్యర్, గవర్నర్ సెక్రటరీ సురేంద్ర మోహన్, GAD సెక్రటరీ శేషాద్రి, సెక్రటరీ R&B శ్రీనివాస్ రాజు, కమిషనర్ I&PR అశోక్ రెడ్డి, హైదరాబాద్ కలెక్టర్ అనుదీప్, ఇతర ఉన్నతాధికారులు సమావేశానికి హాజరయ్యారు.
స్పెషల్ కమీషనర్, సమాచార పౌర సంబంధాల శాఖ చే జారీ చేయనైనది.