భారత్ న్యూస్ హైదరాబాద్…రోహిణి కార్తె ఎప్పటి నుంచి ప్రారంభం? రోళ్లు పగిలే ఎండలకు కారణం ఇదే!
తెలుగు రాష్ట్రాల్లో ఎండల తీవ్రతను సూచించే ‘రోహిణి కార్తె’ (Rohini Karthi 2026) ప్రారంభానికి ముహూర్తం ఖరారైంది. జ్యోతిష్యశాస్త్రం ప్రకారం, గ్రహాల రాజుగా పరిగణించే సూర్య భగవానుడు మే 25వ తేదీ సోమవారం నాడు రోహిణి నక్షత్రంలోకి ప్రవేశించనున్నాడు. జూన్ 8వ తేదీ వరకు సూర్యుడు ఇదే నక్షత్రంలో సంచరించడం వల్ల ఈ పక్షం రోజుల పాటు ఎండలు మునుపెన్నడూ లేని విధంగా భగభగమండనున్నాయి.
‘రోహిణి కార్తె వస్తే రోళ్లు పగులుతాయా?’
వేసవి కాలంలో వచ్చే ఎండలు ఒక ఎత్తు అయితే, రోహిణి కార్తెలో నమోదయ్యే ఉష్ణోగ్రతలు మరో ఎత్తు. ఈ సమయంలో సూర్యుడి కిరణాలు నేరుగా భూమిపై పడటం వల్ల ప్రతాపం తీవ్ర స్థాయిలో ఉంటుంది. అందుకే మండే ఎండల తీవ్రతను తెలపడానికి పెద్దలు “రోహిణి కార్తెలో రోళ్లు పగులుతాయి” అనే సామెతను వాడుకలోకి తెచ్చారు.
వ్యవసాయ పంచాంగం – ఏరువాక ప్రారంభం:
సూర్యుడు ఏ నక్షత్రానికి దగ్గరగా ఉంటే ఆ కాలానికి ఆ నక్షత్రం పేరుతో కార్తెగా పిలుస్తారు. ఏడాదికి మొత్తం 27 కార్తెలు ఉంటాయి.
♦️ రోహిణి కార్తె ముగియగానే జూన్ 9 నుండి మృగశిర కార్తె ప్రారంభమవుతుంది.
♦️ ఈ సమయంలోనే తొలకరి జల్లులు కురుస్తాయి.
♦️ దీనిని బేస్ చేసుకుని రైతులు తమ పొలాల్లో ‘ఏరువాక’ పనులను ముమ్మరం చేస్తారు.
రోహిణి కార్తెలో చేయకూడని పనులు ఇవే:
ఈ పక్షం రోజుల పాటు సూర్యుడి తీవ్రత ఎక్కువగా ఉండటం వల్ల పెద్దలు కొన్ని నియమాలను సూచించారు:
♦️ శుభకార్యాలు వద్దు: రోహిణి కార్తె సమయంలో ఎలాంటి శుభకార్యాలు లేదా కొత్త పనులు ప్రారంభించకపోవడం మంచిది.
♦️ ఆహార నియమాలు: శరీరంలో వేడి పెరగకుండా ఉండేందుకు మాంసాహారానికి దూరంగా ఉంటూ, సాత్విక ఆహారం, ద్రవ పదార్థాలు ఎక్కువగా తీసుకోవాలి.
♦️ ప్రయాణాలు వాయిదా: ఉదయం 11 గంటల నుండి సాయంత్రం 4:30 గంటల వరకు అత్యవసరమైతే తప్ప బయటకు వెళ్లకపోవడం ఉత్తమం. ముఖ్యంగా సుదూర ప్రయాణాలు వాయిదా వేసుకోవాలి.

ఈ కాలంలో సూర్యోదయం కంటే ముందే నిద్రలేచి సూర్య నమస్కారాలు చేయడం మరియు శక్తి మేరకు దానధర్మాలు చేయడం వల్ల శుభ ఫలితాలు కలుగుతాయని భక్తుల నమ్మకం.