ఎన్నికల నిర్వహణలో ఎలక్షన్ సెల్ అధికారులు, సిబ్బంది పాత్ర ప్రశంసనీయం: సీపీ డి ఎస్ చౌహాన్ ఐపీఎస్
ఎలక్షన్ సెల్ సిబ్బందికి బహుమతులు, ప్రశంసాపత్రాలను అందజేసిన రాచకొండ పోలీస్ కమిషనర్
రాచకొండ కమిషనరేట్ పరిధిలో తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ప్రక్రియ ప్రశాంతంగా, ఎటువంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా నిర్వహించబడ్డ సందర్భంగా రాచకొండ పోలీస్ కమిషనర్ డి ఎస్ చౌహాన్ ఐపీఎస్ గారు కమిషనరేట్ ఎలక్షన్ సెల్ సిబ్బందికి అభినందనలు తెలిపారు. క్షేత్ర స్థాయిలో పరిస్థితులకి అనుగుణంగా సిబ్బంది పనిచేయడానికి అవసరమైన తోడ్పాటు అందించిన ఎలక్షన్ సెల్ సిబ్బందిని కమిషనర్ ప్రశంసించారు. ఎన్నికల నోటిఫికేషన్ వెలువడిన రోజు నుండి కౌంటింగ్ ప్రక్రియ ముగిసే వరకూ క్రమశిక్షణతో అప్రమత్తంగా ఉంటూ విధులు నిర్వర్తించడం వల్లే ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగాయని కమిషనర్ పేర్కొన్నారు. అవసరమైన చోట్ల చెక్ పోస్టులు ఏర్పాటు చేసి తనిఖీలు చేయడం ద్వారా అన్ని రకాల అక్రమ తరలింపులు అడ్డుకోవడం సాధ్యం అయిందని, రాష్ట్ర స్థాయిలో గంజాయి,డ్రగ్స్ స్వాధీనం లో మొదటి స్థానం, మొత్తం 68 కోట్ల రూపాయల
విలువైన నగదు, మద్యం,డ్రగ్స్ తదితర వాటిని స్వాధీనం ద్వారా రాష్ట్రంలోనే రెండవస్థానంలో నిలచి, నిష్పక్షపాతంగా ఎన్నికలు జరిగేలా కృషి చేశామని పేర్కొన్నారు. సమీప భవిష్యత్తులో రాచకొండ పరిధిలో నిర్వహించే అన్ని ఎన్నికలను ఇంతే సమర్థవంతంగా నిర్వహిస్తామని కమిషనర్ తెలిపారు.
ఈ కార్యక్రమంలో అదనపు డీసీపీ శ్రీనివాస్ కుమార్, ఎస్బి ఓఎస్డీ మహేష్, ఐటీ సెల్ ఎసిపి నరేందర్ గౌడ్, ఇన్స్పెక్టర్లు కొండల్ రావు, రవికుమార్ లతో పాటు ఇతర అధికారులు మరియు సిబ్బందిని కమిషనర్ అభినందించి, ప్రశంసాపత్రాలను అందజేశారు.