Congress: శశిథరూర్‌కు కాంగ్రెస్ బిగ్ షాక్..

భారత్ న్యూస్ ఢిల్లీ…..Congress: శశిథరూర్‌కు కాంగ్రెస్ బిగ్ షాక్..

ఆయనకు అవకాశం ఇవ్వకుండా..!
పాకిస్థాన్ ఉగ్రకుట్రలను ప్రపంచానికి చూపించేందుకు ఏడు అఖిలపక్ష బృందాలను ఏర్పాటు చేసింది. వాళ్లలో కాంగ్రెస్ సీనియర్ నాయకుడు శశిథరూర్‌ కూడా ఉన్నారు. కానీ కాంగ్రెస్‌ పంపించిన లిస్ట్‌లో శశిథరూర్‌ పేరు లేదు. ఆయన్ని పార్టీ దూరం పెట్టిందనే అనుమానాలు వస్తున్నాయి.

భారత్‌తో యుద్ధానికి దిగిన పాకిస్థాన్‌ను ఏకాకి చేసేందుకు కేంద్రం సిద్ధమైంది. పాకిస్థాన్ ఉగ్రకుట్రలను ప్రపంచానికి చూపించేందుకు ఏడు అఖిలపక్ష బృందాలను ఏర్పాటు చేసింది. ఆ టీమ్‌లకు ఏడుగురు ఎంపీలు నాయకత్వం వహిస్తున్నారు. వాళ్లలో కాంగ్రెస్ సీనియర్ నాయకుడు శశిథరూర్‌ కూడా ఉన్నారు. కానీ కాంగ్రెస్‌ పంపించిన లిస్ట్‌లో శశిథరూర్‌ లేకపోవడం చర్చనీయాంశమవుతోంది.

Congress Gave 4 Names For Global Outreach
ఇక వివరాల్లోకి వెళ్తే పాకిస్థాన్‌ చర్యలను ఎండగట్టేందుకు పంపే టీమ్ కోసం పేర్లు పంపాలని కేంద్రమంత్రి కిరణ్ రిజిజు మే 16న కాంగ్రెస్‌ను కోరారు. ఆరోజున కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌ గాంధీ నాలుగు పేర్లు పంపించారు. వాళ్లలో రాజ్యసభ ఎంపీ డాక్టర్ సయ్యద్ నజీర్‌ హుస్సేన్‌, లోక్‌సభ ఎంపీ రాజా బ్రార్, కేంద్ర మాజీ మంత్రి ఆనంద్ శర్మ, మరో నేత గౌరవ్‌ గొగొయ్‌ ఉన్నారు. ఈ విషయాన్ని ఆ పార్టీ సీనియర్ నేత జైరాం రమేశ్‌ ఎక్స్‌లో తెలిపారు. ఈ లిస్ట్‌లో శశిథరూర్‌ పేరు లేకపోవడం గమనార్హం. దీంతో కాంగ్రెస్‌ పార్టీ శశిథరూర్‌ను దూరం పెడుతుందా అనే అనుమానాలు తలెత్తుతున్నాయి. ఇటీవల ఆపరేషన్ సిందూర్‌ విషయంలో ప్రధాని మోదీని శశిథరూర్‌ పొగిడిన సంగతి తెలిసిందే.

అయితే శనివారం కేంద్రం తుది జాబితాను విడుదల చేసింది. ఈ లిస్ట్‌లో కాంగ్రెస్‌ పంపిన నలుగురి పేర్లు లేవు. కానీ తిరువనంతపురం ఎంపీ అయిన శశిథరూర్‌కు మాత్రం చోటు దక్కింది. దీంతో ఆయన ఎక్స్‌ వేదికగా ఈ విషయాన్ని వెల్లడించారు. ” ఇటీవల జరిగిన పరిణామాలపై భారత విధానాన్ని ప్రపంచ దేశాలకు వివరించేందుకు వెళ్తున్న టీమ్‌కు నాయకత్వం వహించడం గౌరవంగా భావిస్తున్నాను. దేశ ప్రయోజనాలతో ముడిపడి ఉండే విషయాల్లో నా అవసరం ఉంటే అందుబాటులో ఉంటానని” రాసుకొచ్చారు.