భారత్ న్యూస్ శ్రీకాకుళం….అతనో సాధారణ కానిస్టేబుల్. అందరూ చూస్తుండగా ఓ పోలీస్ ఉన్నతాధికారి తనను అవమానించడాన్ని అతను ఏమాత్రం తీసుకోలేకపోయాడు. కొడితే కుంభస్థలాన్నే కొట్టాలని ఫిక్సయి కానిస్టేబుల్ ఉద్యోగానికి రాజీనామా చేసి సివిల్స్ కు ప్రిపేరవ్వడం ప్రారంభించాడు.
అలా వరుసగా మూడు సార్లు విఫలమైనా పట్టు వదలని విక్రమార్కుడిలా పట్టుదలతో చదివి నాలుగో ప్రయత్నంలో ఆల్ ఇండియా 780వ ర్యాంకు, ఐదో ప్రయత్నంలో 350 ర్యాంకు సాధించి ఔరా అనిపించిన ఉదయ్ కృష్ణారెడ్డి .
ప్రకాశం జిల్లా సింగరాయకొండ మండలం ఊళ్ళపాలెంలో ఒక సాధారణ కుటుంబంలో ఉదయ్ జన్మించాడు. చిన్నతనంలోనే తల్లిదండ్రులిద్దరినీ పోగొట్టుకున్నాడు.
అప్పటినుంచి ఉదయ్ , తన తమ్ముడు ప్రణయ్ ని నాయనమ్మ రమణమ్మ చేరదీసింది. కూరగాయల వ్యాపారం చేస్తూ తన ఇద్దరి మనవళ్లును ఎంతో కష్టపడి చదివించింది.
నాయనమ్మ కష్టాలను స్వయంగా చూసిన ఉదయ్ చిన్నపటి నుంచే ఎంతో పట్టుదలతో చదివేవాడు.
ప్రాథమిక విద్యాభ్యాసమంతా ప్రభుత్వ పాఠశాలలోనే పూర్తి చేశాడు.ఇంటర్, డిగ్రీ పూర్తి చేసి గవర్నమెంట్ జాబ్స్ కోసం ప్రిపేర్ అవడం మొదలు పెట్టి 2013లో మొదటి ప్రయత్నంలో కానిస్టేబుల్ ఉద్యోగాన్ని సాధించాడు.
ఆ ఉద్యోగం అంతగా సంతృప్తిని ఇవ్వకపోయినా కుటుంబ పరిస్థితి దృష్ట్యా 2019 వరకు అదే ఉద్యోగం చేశాడు. ఎంత చదివినా వరుసగా మూడుసార్లు సివిల్స్ సాధించలేకపోయాడు. అయినా నిరాశ చెందకుండా అలానే పట్టుదలతో చదివి 2023లో UPSC వెల్లడించిన సివిల్స్ ఫలితాల్లో ఆల్ ఇండియా 780వ ర్యాంక్ సాధించి IRS కు ఎంపికయ్యాడు.
అయితే తన ఆశయం IRS కాదని IAS లేదా IPSలో చేరడమే తన లక్ష్యమని ప్రిపరేషన్ ఆపకుండా అలానే కొనసాగించి ఐదోసారి కూడా సివిల్స్ కు ప్రయత్నించాడు.

ఇటీవల UPSC విడుదల చేసిన ఫలితాల్లో ఉదయ్ కృష్ణారెడ్డి ఈసారి ఆల్ ఇండియా 350 ర్యాంక్ సాధించి IPS కు సెలెక్ట్ అయి చివరకు తాను అనుకున్నది సాధించి ఎంతో మందికి ఆదర్శంగా నిలిచాడు.