…Bharathnews.hyd,,,
మీడియా విభాగాల మధ్య సమన్వయం సమర్థవంతమైన ప్రభుత్వ కమ్యూనికేషన్ కు దారితీస్తుంది: శ్రీ. సంజయ్ జాజు(కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ కార్యదర్శి)
నాంపల్లి డివిజన్ లోని గోకుల్ నగర్, బజార్ ఘాట్ వద్ద వికసిత్ భారత్ సంకల్ప్ యాత్ర (అర్బన్) లో పాల్గొన్న శ్రీ సంజయ్ జాజు
17, ఫిబ్రవరి, 2024
సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ కార్యదర్శి శ్రీ సంజయ్ జాజు ఈ రోజు నగరంలో పిఐబి, సిబిసి, డిపిడి, డిడి, ఎఐఆర్, సిబిఎఫ్సి వంటి తెలంగాణ మీడియా విభాగాల అధిపతులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ప్రభుత్వ కమ్యూనికేషన్ విస్తృత వ్యాప్తి మరియు సమర్థవంతమైన వ్యాప్తిని సాధించడానికి అన్ని మీడియా విభాగాల సమన్వయ ప్రాముఖ్యతను గురించి వివరించారు. ప్రభుత్వం తీసుకువచ్చిన వివిధ సంక్షేమ పథకాలపై ప్రజల్లో అవగాహన పెంచాలని మీడియా విభాగాలను ఆదేశించారు.
కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం శ్రీ సంజయ్ జాజు తెలంగాణ రాష్ట్ర పర్యటనకు వచ్చిన సందర్భంగా కేంద్ర ప్రభుత్వ కార్యాలయ సముదాయంలోని సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖకు చెందిన కార్యాలయాలని, దూరదర్శన్ ని సందర్శించారు.
శ్రీ సంజయ్ జాజు బజార్ ఘాట్ నాంపల్లి డివిజన్ గోకుల్ నగర్ లో వికసిత్ భారత్ సంకల్ప్ యాత్ర (అర్బన్)-2వ దశ లో పాల్గొన్నారు. వివిధ కేంద్ర ప్రభుత్వ పథకాలకు సంబంధించిన సమాచారాన్ని ప్రదర్శిస్తూ సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖకు చెందిన ఐఈసీ మెటీరియల్ ను ఆయన ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో వివిధ కేంద్ర ప్రభుత్వ స్టాళ్లను సందర్శించిన కార్యదర్శి వివిధ కేంద్ర ప్రభుత్వ పథకాల లబ్ధిదారులతో మాట్లాడారు.
ప్రస్తుతం తెలంగాణలో రెండో దశ వికసిత్ భారత్ సంకల్ప యాత్ర కొనసాగుతోంది. వికసిత్ భారత్ సంకల్ప్ యాత్ర ప్రధాన ఉద్దేశ్యం పౌరులకు విస్తృతమైన సంక్షేమ పథకాల గురించి అవగాహన, సాధికారత కల్పించడం. ప్రజలు గణనీయమైన ఆసక్తి తో, చురుకైన భాగస్వామ్యం తో ఈ కార్యక్రమం లో పాల్గొంటున్నారు, సామాజిక సంక్షేమం, సమ్మిళితతను ప్రోత్సహించే విధంగా వికసిత్ భారత్ సంకల్ప యాత్ర కొనసాగుతోంది.