వైశాఖమాస ప్రారంభం

భారత్ న్యూస్ తిరుపతి…వైశాఖమాస ప్రారంభం

వైశాఖమాసం తెలుగు నెలల్లో రెండోది. వసంతశోభ వెల్లివిరిసే సమయమిది. ఇదే తరుణంలో ఎండలు ముదురుతుంటాయి. అందుకే వైశాఖం పచ్చిందంటే మనవారు కూడళ్లలో చలివేంద్రాలు ఏర్పాటు చేస్తుంటారు. మండువేసవిలో మంచినీళ్లు దానం చేయడం. కంటే గొప్పది లేదంటారు. దాహంతో ఉన్నవారికి మంచినీళ్లివ్వడం, ఆకలిగొన్నవాడికి అన్నం పెట్టడమే అన్నింటికంటే గొప్ప ధర్మాలు. అవే మనం సంపాదించుకోదగిన అసలైన పుణ్యాలు. ఆ బాటలో నడవాలి. మనం చేసుకునే పుణ్యకార్యక్రమాలకు లక్ష్మీదేవి స్వయంగా అక్షయ ఫలాలను అనుగ్రహించే మహత్తర పర్వదినం అక్షయ తృతీయ. ఆరోజు మహాలక్ష్మీపూజ నిర్వహిస్తారు. పొదుపుకి, మదుపుకి అనుకూలంగా ఆనాడు కొద్దిగానైనా బంగారాన్ని కొనుక్కోమని పెద్దలు చెబుతుంటారు.

ఆరోజునే సింహాచలం లక్ష్మీనరసింహ స్వామికి చందనోత్సవం నిర్వహిస్తారు. ఏడాది పొడవునా చందనపు పూతలోనే దర్శనమిచ్చే ఆ స్వామి నిజరూపాన్ని చూడగలిగే ఒకే ఒక్కరోజు అక్షయ తృతీయ.

బదరీ నారాయణుడు, కేదారనాథుడు తమ దర్శనాలను అనుగ్రహించే శుభతరుణం కూడా ఇదే. పరశురాముడు, ఆదిశంకరుడు మొదలు ఎందరెందరో విశ్వగురువులు తెలుగు నెలల ప్రకారం వైశాఖంలోనూ. ఇంగ్లీషు నెలల ప్రకారం మే మాసంలోనే పుట్టడం యాదృచ్ఛికం. గౌతమబుద్ధుడు, రామానుజులు, వీరబ్రహ్మేంద్రస్వామి, బసవేశ్వరుడు వంటి గురువులు ఈమాసంలోనే పుట్టారు. దైవాలు సైతం ఈమాసంలోనే పుట్టారు. శుక్లపక్షం చివరిలో నృసింహ జయంతి నాడు, బహుళపక్షంలో హనుమజ్జయంతి నాడు వస్తాయి. నృసింహజయంతి సందర్భంగా ఆలయాలన్నింటిలో ప్రత్యేక ఉత్సవాలు నిర్వహిస్తుంటారు.

వైశాఖానికి మాధవమాసమని పేరున్న కారణంగా అనేక వైష్ణవాలయాల్లో కల్యాణాలు, బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తుంటారు. అన్నవరం సత్యనారాయణ స్వామి కల్యాణం కూడా ఈ మాసంలోనే జరగనుంది. అదే కాకుండా తెలుగునాట అనేక జాతరలు కూడా జరగబోతున్నాయి. ఆ దేవీ దేవతలందరూ మనందరినీ చల్లగా చూడాలని, అందరికీ క్షేమం కలగాలని కోరుకుందాం.