ప్రసూతి సమయంలో వైద్య సేవలపై ప్రత్యేక శ్రద్ధ చూపాలి

భారత్ న్యూస్ గుంటూరు…ప్రసూతి సమయంలో వైద్య సేవలపై ప్రత్యేక శ్రద్ధ చూపాలి

Ammiraju Udaya Shankar.sharma News Editor…ఆధునిక వైద్య విధానాలు అందుబాటులో ఉన్న తరుణంలో ప్రసూతి సమయంలో అందించే సేవలపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని… పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లోని ప్రభుత్వ వైద్యులు, నర్సింగ్ సిబ్బందికి ఎప్పటికప్పుడు ఇందుకు సంబంధించిన సేవలపై అనుభవజ్ఞులతో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కల్యాణ్ గారు స్పష్టం చేశారు. బుధవారం మధ్యాహ్నం క్యాంపు కార్యాలయం నుంచి కాకినాడ జిల్లా కలెక్టర్, పిఠాపురం ఏరియా డెవలప్మెంట్ అథారిటీ (పడా) ప్రాజెక్ట్ డైరెక్టర్ తో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఇటీవల పిఠాపురం నియోజకవర్గం చేబ్రోలుకి చెందిన శ్రీమతి దొండపాటి శ్రీదుర్గ పిఠాపురం ప్రభుత్వ ఆసుపత్రిలో బిడ్డను ప్రసవించిన అనంతరం అపస్మారక స్థితికి చేరుకోవడం, కాకినాడ ఆసుపత్రికి తరలించగా మృతి చెందిన ఘటనపై సమీక్ష నిర్వహించారు.
ప్రసూతి సమయంలో వైద్య సేవల విషయంలో ఏ దశలోనూ నిర్లక్ష్యంగా ఉండకూడదని, అప్రమత్తంగా ఉండాలని ఆయన స్పష్టం చేశారు. గర్భిణులకు వైద్యం నుంచి ప్రసవం వరకూ, అనంతర వైద్యం ప్రభుత్వ ఆసుపత్రుల్లో సక్రమంగా అందాలని చెప్పారు. పిఠాపురం ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యురాలి విధి నిర్వహణ తీరు, ఇతర సిబ్బంది వ్యవహారంపై విచారణ చేయాలని జిల్లా కలెక్టర్ ను ఆదేశించారు. పిఠాపురం ఆసుపత్రిని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తున్నామని, నియోజకవర్గంలో వైద్యం అందించే విధానం అందరికీ ఒక మోడల్ గా నిలవాలని.. ఆ దిశగా చేపట్టాలని దిశానిర్దేశం చేశారు.

  • శ్రీదుర్గ మరణంపై విచారం వ్యక్తం చేసిన ఉపముఖ్యమంత్రి గారు
  • జిల్లాలో ప్రసూతి మరణాలపై ఎప్పటికప్పుడు మెటర్నల్ డెత్ ఆడిట్ నిర్వహించాలి
  • పిఠాపురం నియోజకవర్గానికి చెందిన శ్రీమతి శ్రీదుర్గ ప్రసూతి మరణంపై తక్షణం నివేదిక పంపించండి
  • కాకినాడ జిల్లా కలెక్టర్, పడా ప్రాజెక్ట్ డైరెక్టర్ తో గౌ|| ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు వీడియో కాన్ఫరెన్స్

కాకినాడ జిల్లాలో మెటర్నల్ డెత్ ఆడిట్ నిర్వహణ గురించి ఆరా తీశారు. ప్రసూతి మరణాలు సీరియస్ గా తీసుకోవలసిన అంశమనీ, ఇలాంటి మరణాలు సంభవించినప్పుడు తక్షణమే నిపుణులైన వైద్యుల బృందంతో సమగ్రంగా విచారణ చేసి కారణాలను నమోదు చేయాలని పేర్కొన్నారు. శ్రీమతి శ్రీదుర్గ ప్రసూతి మరణంపై, పుట్టిన బిడ్డ ఆరోగ్య స్థితిపై సమగ్ర నివేదిక ఇవ్వాలని జిల్లా కలెక్టర్ ను ఆదేశించారు.

జిల్లాలోని కొన్ని ఆసుపత్రులపై వైద్యులు, ఇతర సిబ్బంది తమ విశ్వాసాల ప్రచారానికి ప్రాధాన్యం ఇస్తున్నారనే ఫిర్యాదులు వస్తున్నాయని ప్రస్తావించి – ప్రభుత్వ ఆసుపత్రులను వ్యక్తిగత విశ్వాసాల ప్రచారానికి వేదికలుగా చేయకూడదన్నారు.
పిఠాపురం నియోజకవర్గం చేబ్రోలుకి చెందిన శ్రీమతి శ్రీదుర్గ మరణంపై విచారం వ్యక్తం చేశారు. ఆమె కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియచేశారు. ఈ కాన్ఫరెన్స్ లో శాసనమండలి విప్ శ్రీ పిడుగు హరిప్రసాద్, పంచాయతీరాజ్ కమిషనర్ శ్రీ కృష్ణ తేజ, కాకినాడ జిల్లా కలెక్టర్ శ్రీ షాన్ మోహన్, పడా ప్రాజెక్ట్ డైరెక్టర్ చైత్ర పాల్గొన్నారు.