బిజెపికి ఓటేస్తే.. బానిస బతుకులే..రాష్ట్ర అటవీ పర్యావరణ,దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ,,

భారత్ న్యూస్ హైదరాబాద్..

బిజెపికి ఓటేస్తే.. బానిస బతుకులే..

రాష్ట్ర అటవీ పర్యావరణ,దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ

ఎంపీ అభ్యర్థి నీలం మధు గెలుపు కోసం సంగారెడ్డిలో సిపిఎం విస్తృత స్థాయి సమావేశం

విచ్చేసిన ఎంపీ అభ్యర్థి నీలం మధు, TSIIC చైర్మన్ నిర్మలా జగ్గారెడ్డి, సిపిఎం కార్యదర్శివర్గ సభ్యులు చుక్కా రాములు, మాజీ ఎమ్మెల్సీ సత్యనారాయణ, కాంగ్రెస్ నేత పులిమామిడి రాజు

సంగారెడ్డి : ఈ పార్లమెంట్ ఎన్నికలలో బిజెపికి ఓటేస్తే అందరివి బానిస బతుకులు అవుతాయని రాష్ట్ర అటవీ పర్యావరణ, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ అన్నారు. ఒక్కసారి ఆలోచన చేసి ఓటు వేయాలని ఆమె సూచించారు. సిపిఎం బలపరిచిన మెదక్ పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి నీలం మధు గెలుపు కోసం సిపిఎం విస్తృత స్థాయి సమావేశం సంగారెడ్డి లోని పిఎస్ఆర్ గార్డెన్ లో జిల్లా కార్యదర్శి గొల్లపల్లి జయరాజ్ అధ్యక్షతన నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన మంత్రివర్యులు కొండా సురేఖ మాట్లాడుతూ.. ప్రైవేటీకరణను పెంచి పోషిస్తున్న ప్రధాని మోదీకి పేదల కష్టాలు, సంక్షేమం, చదువులు, వైద్యం కనిపించవని దుయ్యబట్టారు. కేవలం ఆదాని, అంబానీలకు ఏం కావాలో? చూస్తారని విమర్శించారు. స్వర్గీయ ఇందిరాగాంధీ ప్రధాని ఉన్న సమయంలోనే అనేక పరిశ్రమలను నెలకొల్పడం జరిగిందని, వేలాదిమందికి ఉపాధి దక్కిందని గుర్తు చేశారు. స్వర్గీయ ప్రధాని రాజీవ్ గాంధీ హాయంలోనే ఐటి రంగానికి బీజం పడిందని, మహిళా రిజర్వేషన్లు బిల్లు తీసుకురావడం జరిగింది అని పేర్కొన్నారు. 25 ఏళ్లు వెనుకబాటుకు గురైన మెదక్ ప్రాంతం అభివృద్ధి కాంగ్రెస్ ద్వారానే సాధ్యమవుతుందన్నారు. ఎంపీ అభ్యర్థిగా పోటీలో ఉన్న బిసి యువనేత నీలం మధును భారీ మెజారిటీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.

మతోన్మాద శక్తులను ఎదిరించాలి సిపిఎం కార్యదర్శివర్గ సభ్యులు చుక్కా రాములు..

దేశంలో మతోన్మాద రాజకీయ శక్తులను ఎదిరించాల్సిన సమయం ఆసన్నమైందని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు చుక్క రాములు పిలుపునిచ్చారు. ఆ దిశగా పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరూ ముందుకు వచ్చి ఈ పార్లమెంటు ఎన్నికలలో బిజెపికి బుద్ధి చెప్పాలన్నారు. ఇప్పటికే దేశంలోని పలు సంస్థలను ప్రైవేటీకరణకు ప్రోత్సహించిన మోది రైతాంగం పై కూడా కన్నేసారని విమర్శించారు. రైతుల పంటలకు మద్దతు ధర, రైతన్న చట్టాలను అమలు చేయకుండా నిర్బంధాన్ని కొనసాగిస్తున్నారని పేర్కొన్నారు. ఈ దేశంలో బీజేపీ ప్రభుత్వం మళ్లీ అధికారంలోకి వస్తే కార్మిక చట్టాలు ఖతమవుతాయన్నారు. ఈ దేశంలో సామాజిక న్యాయానికి కాంగ్రెస్ బీసీల కుల గణనకు ముందుకు రావడానికి సిపిఎం స్వాగతిస్తోందని పేర్కొన్నారు. దేశ ప్రధాని అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని, ఎలక్షన్ కమిషన్ కూడా మౌన పాత్ర వహిస్తుందని దుయ్యబట్టారు. రాష్ట్రంలో ప్రజాస్వామిక అవినీతి పరిపాలన బీఆర్ఎస్ కొనసాగిందని చెప్పారు. అందుకే టిఆర్ఎస్ పాలనకు ప్రజలు చరమగీతం ప డారని స్పష్టం చేశారు. మెదక్ పార్లమెంట్లో కాంగ్రెస్ అభ్యర్థి గెలుపు కోసం ప్రజా సంఘాలన్నీ ఏకం కావాలని పిలుపునిచ్చారు.