..భారత్ న్యూస్ హైదరాబాద్….మళ్లీ కొవిడ్ టెస్టులు!
కరోనా కలకలంతో వైద్య, ఆరోగ్యశాఖ అప్రమత్తం
లక్షణాలుంటే పరీక్షలు చేయించుకోండి
వైద్యాధికారుల సూచన
వైరస్ ప్రభావం కొంతే.. భయపడాల్సిన పనిలేదంటూ..అభయం
10 మంది వైద్యనిపుణులతో గాంధీలో కొవిడ్ కమిటీ ఏర్పాటు
సిటీబ్యూరో, మే 25 బన్సీలాల్పేట: కరోనా కేసులు మరోసారి నమోదవుతుండడంతో వైద్య, ఆరోగ్యశాఖ అప్రమత్తమైంది. ప్రస్తుతం వెలుగుచూస్తున్న కరోనా వేరియంట్ పెద్ద ప్రమాదకారి కాకపోయినప్పటికీ ముందు జాగ్రత చర్యగా అనుమానిత లక్షణాలుంటే పరీక్షలు చేయించుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. ఇప్పటికే నగరంలో ఓ పాజిటివ్ కేసు నమోదవడంతో అనుమానితులకు పరీక్షలు జరిపేందుకు వైద్యాధికారులు చర్యలు చేపట్టారు.
మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలో నమోదైన కరోనా కేసును దృష్టిలో పెట్టుకుని జిల్లా పరిధిలో మల్కాజిగిరి ఏరియా హాస్పిటల్, జనరల్ హాస్పిటల్లో కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నట్లు జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ ఉమాగౌరి తెలిపారు. హైదరాబాద్ జిల్లా పరిధిలో ఇప్పటికే గాంధీ దవాఖానలో కరోనా పరీక్షలు జరుపుతుండగా, మరో 5 కొవిడ్ టెస్ట్ కేంద్రాలను అందుబాటులోకి తీసుకువస్తున్నట్లు జిల్లా, వైద్య, ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ వెంకటి తెలిపారు.
ప్రస్తుతం జిల్లా పరిధిలో ఎలాంటి కరోనా కేసులు నమోదు కాలేదని, పరిస్థితులకు అనుగుణంగా ఎప్పటికపప్పుడు అవసరమైన చర్యలు తీసుకోనున్నట్లు చెప్పారు. రంగారెడ్డి జిల్లా పరిధిలో కొండాపూర్ జిల్లా హాస్పిటల్తో పాటు వనస్థలిపురం ఏరియా హాస్పిటల్లో కరోనా పరీక్షలు అందుబాటులో ఉన్నట్లు జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ వెంకటేశ్వర్లు వెల్లడించారు. ఇప్పటివరకు జిల్లా పరిధిలో ఎలాంటి పాజిటివ్ కేసులు నమోదు కాలేదని, కేసుల ఆధారంగా కొవిడ్ టెస్ట్ కేంద్రాలను పెంచుతామన్నారు.
అనుమానాస్పద లక్షణాలుంటే..
అక్కడక్కడ నమోదవుతున్న కరోనా కేసులతో భయపడాల్సిన పనిలేదంటున్నారు వైద్యనిపుణులు. అయితే వైరస్ దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులపై కొంత ప్రభావం చూపే అవకాశమున్నందున ఆ రోగులు జాగ్రతలు పాటించాల్సిన అవసరం ఉందని సూచిస్తున్నారు. అంతేకాకుండా కొవిడ్ అనుమానిత లక్షణాలున్నవారు ముందు జాగ్రత్త చర్యగా కరోనా పరీక్షలు చేయించుకోవడం మంచిదని సూచిస్తున్నారు. ఎవరికైనా పాజిటివ్ అని నిర్ధారణ జరిగితే వెంటనే వారు స్వీయ ఐసొలేషన్ పాటిస్తూ వైద్యులు సూచించిన మందులు వాడాలని చెబుతున్నారు.
కొవిడ్ కమిటీ ఏర్పాటు
కొవిడ్ కేసుల వ్యాప్తి నేపథ్యంలో గాంధీ దవాఖాన పాలన యంత్రాంగం అప్రమతంగా ఉన్నదని సూపరింటెండెంట్ డాక్టర్ రాజకుమారి అన్నారు. శనివారం జరిగిన సమావేశంలో కొవిడ్ కేసులను ఎదుర్కోవడానికి 10 మంది వైద్య నిపుణులతో ప్రత్యేక కొవిడ్ కమిటీ ఏర్పాటు చేశామన్నారు.
అలాగే 60 బెడ్లతో కూడిన 3 కరోనా వార్డులను సిద్ధం చేశామని చెప్పారు. ఇందులో అత్యవసర రోగుల కోసం 15 బెడ్లతో స్పెషల్ వార్డును ఎమర్జెన్సీ విభాగం వెనక ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. ప్రతి ఒక్కరూ కొవిడ్ నిబంధనలు పాటించాలని.. ఏవైనా లక్షణాలు కనిపిస్తే వెంటనే డాక్టర్ ను సంప్రదించాలన్నారు.
కొవిడ్ కమిటీ ఇదే
కొవిడ్ కమిటీ చైర్మన్ గా సూపరింటెండెంట్ డాక్టర్ రాజకుమారి, నోడల్ ఆఫీసర్గా జనరల్ మెడిసిన్ హెచ్వోడీ డాక్టర్ ఎల్ సునీల్ కుమార్ వ్యవహరిస్తారు. కమిటీ సభ్యులుగా డిప్యూటీ సూపరింటెండెంట్ డాక్టర్ కే సునీల్ కుమార్, ఆర్ఎంవో -1 డాక్టర్ శేషాద్రి, పల్మనాలజీ హెచ్వోడీ డాక్టర్ కృష్ణమూర్తి, అనిస్థీషియా హెచ్వోడీ ఆవుల మురళీధర్, పీడియాట్రిక్ హెచ్వోడీ డాక్టర్ వాసుదేవ్, గైనకాలజీ హెచ్వోడీ డాక్టర్ రాధా, మైక్రో బయాలజీ హెచ్వోడీ డాక్టర్ పూజ, డ్యూటీ ఆర్ఎంవో, పీజీ వైద్యులు ఉన్నారు. కొవిడ్ పాజిటివ్ బాధితులు గాంధీలో అడ్మిట్ అయిన పరిస్థితుల్లో వారికి అందించే అత్యవసర వైద్యం, తదితర వసతులపై ఈ కమిటీ ఎప్పటికప్పుడు సమావేశమై నిర్ణయాలు తీసుకుంటుందని డిప్యూటీ డాక్టర్ కే సునీల్ కుమార్ తెలిపారు.
