వైభవంగా సాక్షాత్కార వైభవోత్సవాలు ప్రారంభం

భారత్ న్యూస్ తిరుపతి….వైభవంగా సాక్షాత్కార వైభవోత్సవాలు ప్రారంభం

శ్రీనివాసమంగాపురం శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామి వారి ఆలయంలో సాక్షాత్కార వైభవోత్సవాలు సోమవారం వైభవంగా ప్రారంభమయ్యాయి. ఈ ఉత్సవాలు మూడు రోజుల పాటు జరుగనున్నాయి.

ఇందులో భాగంగా సోమవారం ఉదయం సుప్రభాతంతో స్వామివారిని మేల్కొలిపి, తోమాలసేవ, కొలువు, పంచాంగ శ్రవణం, సహస్రనామార్చన నిర్వహించారు. ఉదయం 11 నుండి 12 గంటల వరకు ఆల‌య ముఖ మండపంలో శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఉత్సవర్లకు స్నపన తిరుమంజనం నిర్వహించారు. పాలు, పెరుగు, తేనె, పసుపు, చందనం, కొబ్బరినీళ్లతో అభిషేకం చేశారు. సాయంత్రం 5 నుండి 6 గంటల వరకు ఊంజల్‌ సేవ చేపట్టారు. రాత్రి 7 గంటలకు పెద్దశేష వాహనంపై స్వామివారు ఆలయ మాడ వీధుల్లో విహరించి భక్తులకు దర్శనమిచ్చారు.

అదేవిధంగా జూలై 01న మంగళవారం హనుమంత వాహనంపై, జూలై 02న బుధవారం గరుడ వాహనంపై స్వామివారు విహరించి భక్తులను అనుగ్రహించనున్నారు.

జూలై 03న పార్వేట ఉత్సవం

జూలై 03వ తేదీన గురువారం ఉదయం తోమాల సేవ, కొలువు, పంచాంగ శ్రవణం, సహస్రనామార్చన, శాత్తుమొర, అనంతరం ఉదయం 07 – 11 గం.ల వరకు ఉత్సవ మూర్తులు పార్వేట మండపానికి వేంచేపు చేస్తారు. ఉదయం 11 – 02 గం.ల మధ్య పార్వేట ఉత్సవం జరుగనుంది. ఈ సందర్భంగా ఆస్థానం, వైదిక, సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించనున్నారు.

ఈ కార్యక్రమంలో ఆల‌య ప్రత్యేక శ్రేణి డెప్యూటీ ఈవో శ్రీమతి వరలక్ష్మి, ఏఈవో శ్రీ గోపినాథ్, ఇతర అధికారులు పాల్గొన్నారు.

టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.