పోలవరం వద్ద గోదావరి ఉగ్రరూపం… నీట మునిగిన ఆలయ మార్గం

భారత్ న్యూస్ గుంటూరు….పోలవరం వద్ద గోదావరి ఉగ్రరూపం… నీట మునిగిన ఆలయ మార్గం

ఎగువ వర్షాలతో పోలవరం ప్రాజెక్టు వద్ద పెరుగుతున్న గోదావరి

48 గేట్ల ద్వారా లక్ష క్యూసెక్కులకు పైగా నీటి విడుదల

నీట మునిగిన మహానందీశ్వర ఆలయానికి వెళ్లే దారి

స్పిల్‌వే ఎగువన 27 మీటర్లు దాటిన నీటిమట్టం

ముంపునకు గురవుతున్న పోలవరం, గూటాల మధ్య ఇసుక తిన్నెలు

ఎగువన కురుస్తున్న భారీ వర్షాల కారణంగా పోలవరం ప్రాజెక్టు వద్ద గోదావరి నది ఉధృతంగా ప్రవహిస్తోంది. వరద ప్రవాహం క్రమంగా పెరుగుతుండటంతో ప్రాజెక్టు వద్ద నీటిమట్టం గణనీయంగా పెరిగింది. ప్రస్తుతం ప్రాజెక్టు స్పిల్‌వే వద్ద ఎగువన నీటిమట్టం 27.230 మీటర్లకు చేరగా, దిగువన 18 మీటర్లుగా నమోదైంది.

పెరుగుతున్న వరదను దృష్టిలో ఉంచుకుని అధికారులు అప్రమత్తమయ్యారు. ప్రాజెక్టుకు చెందిన 48 గేట్లను ఎత్తి, స్పిల్‌వే ఛానెల్ ద్వారా 1,13,436 క్యూసెక్కుల మిగులు జలాలను తిరిగి గోదావరిలోకి విడుదల చేస్తున్నారు. ఈ వరద ప్రవాహం కారణంగా, మహానందీశ్వర స్వామి ఆలయానికి రాకపోకల కోసం నిర్మించిన రహదారి పూర్తిగా నీట మునిగింది. దీంతో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.

అదేవిధంగా, పోలవరం, గూటాల గ్రామాల మధ్య ఉన్న ఇసుక తిన్నెలు కూడా క్రమంగా వరద నీటిలో మునిగిపోతున్నాయి. గోదావరికి వరద ప్రవాహం కొనసాగుతుండటంతో అధికారులు పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ, అవసరమైన చర్యలు తీసుకుంటున్నారు..