భారత్ న్యూస్ శ్రీకాకుళం…ఒక పూట భోజనం.. కిలోమీటర్ల కొద్దీ నడక.. రూపాయి పతనంతో విదేశీ విద్యార్థులకు కష్టాలు
🇺🇸డాలర్తో పోలిస్తే రూపాయి పతనం కావడం అనేది ఎక్కువగా చమురు దిగుమతులు, స్టాక్ మార్కెట్లు, వాణిజ్యలోటు కోణంలోనే చర్చకు వస్తున్నది. కానీ విదేశీ డిగ్రీ, చదువు తర్వాత మంచి ఆదాయం సంపాదించాలనే కలలతో ఇండ్లను వదిలివెళ్లిన లక్షలాది భారతీయ విద్యార్థులను సైతం ఇది తీవ్రంగా ప్రభావితం చేస్తున్నది. చదువు కంటే ఎక్కువగా రోజులు ఎలా గడుపాలన్న ఆలోచనలతో విద్యార్థులు సతమతమవుతున్నారు. బలహీనపడుతున్న రూపాయి విలువ విదేశాల్లో ఉన్న అనేక మంది భారతీయ విద్యార్థులను బతుకడానికి బడ్జెట్ వేసుకునేలా చేసింది.
🇮🇳అధికారిక పార్ట్ టైమ్ షిఫ్ట్లతోపాటు డిపార్ట్మెంటల్ స్టోర్లు, రైల్వేస్టేషన్లలో ఫ్లోర్లను తుడవడం వంటి కష్టతరమైన పనులు చేయడం నుంచి, రోజుకు ఒక పూట మాత్రమే తింటూ జీవించడం లేదా అసలు భోజనమే మానేయడం వరకు.. పతనమవుతున్న రూపాయి మధ్య విదేశాలలో చదువుకోవడం అనేది చాలా కఠినంగా మారింది. విపరీతమైన సంపన్న కుటుంబాల నుంచి వచ్చినవారు తప్ప మిగిలిన చాలామంది పరిస్థితి ఇదే. భోజనాలు మానేస్తూ కేవలం మనుగడ కోసమే నిరంతరం పోరాడుతున్నప్పుడు ఇక చదువుపై ఎప్పుడు దృష్టి పెడుతారు? ఈ పోరాటం కేవలం విద్యార్థుల బరువు తగ్గడంలోనే కాకుండా వారి గ్రేడ్లలో కూడా ప్రతిఫలిస్తున్నది.
