ఏప్రిల్లో పెరగనున్న వేడి, ఉక్కపోత!..వాతావరణ విభాగం అంచనా

భారత్ న్యూస్ విశాఖపట్నం..ఏప్రిల్లో పెరగనున్న వేడి, ఉక్కపోత!..వాతావరణ విభాగం అంచనా

విశాఖపట్నం: రాష్ట్రంలో ఈ నెలలో వేడి, ఉక్కపోత మరింత పెరగనున్నాయి. ఏప్రిల్-జూన్ మధ్యలో గరిష్ఠ ఉష్ణోగ్రతలు సాధారణం కంటే ఎక్కువగా నమోదు కావొచ్చని భారత వాతావరణ విభాగం పేర్కొంది. కనిష్ఠ ఉష్ణోగ్రతలు సైతం అదే స్థాయిలో పెరుగుతాయని అంచనా వేస్తోంది. మంగళవారం ఐఎండీ విడుదల చేసిన వేసవికి సంబంధించిన సీజనల్ అవుట్లుక్లో ఈ వివరాలు వెల్లడించింది. వాటి ప్రకారం.. ఏప్రిల్-జూన్ మధ్యలో రాష్ట్రంలో వడగాలులు సాధారణం కంటే ఎక్కువ రోజులు ప్రభావం చూపనున్నాయి. ఉమ్మడి అనంతపురం, చిత్తూరు మినహా రాష్ట్రవ్యాప్తంగా వడగాలులు వీస్తాయని అంచనా. ఏప్రిల్లో కోస్తా జిల్లాల్లో వడగాలుల తీవ్రత కొనసాగనుంది. ఉమ్మడి చిత్తూరు, నెల్లూరు, కడప, ప్రకాశం, గుంటూరు, తూర్పుగోదావరి, విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో వేడి తీవ్రత పెరిగే అవకాశముంది. అదే సమయంలో రాష్ట్రవ్యాప్తంగా ఏప్రిల్లో సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం నమోదవుతుందని ఐఎండీ అంచనా వేస్తోంది.

వేడి పెరగడంతో వరి, పెసర, మినుము, కూరగాయల దిగుబడి తగ్గొచ్చని ఐఎండీ పేర్కొంది. మామిడి, అరటి పంటల్లో పూత, పిందె రాలిపోయే ప్రమాదముంది. ఈ నేపథ్యంలో పంట నష్టపోకుండా నేలలో తగిన తేమ ఉండేలా తరచూ నీటి తడులు అందించాలని, వేడిని తట్టుకోవడానికి పొటాషియం లేదా ఇతర యాంటీ ట్రాన్స్పరెంట్లను ఆకులపై పిచికారీ చేయాలని సూచించింది.

నేడు 10 మండలాల్లో వడగాలులు..

రాష్ట్రంలో మంగళవారం ఉష్ణోగ్రతలు కొంత తగ్గాయి. అత్యధికంగా నంద్యాల జిల్లా దొర్నిపాడులో 40.9 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. బుధవారం పోలవరం జిల్లాలోని చింతూరు, కూనవరం మండలాల్లో తీవ్ర వడగాలులు, పలు మండలాల్లో వడగాలులు వీయొచ్చని విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ తెలిపారు. విజయనగరం జిల్లా బాడంగి, మెరకముడిదాం, తెర్లాం, వంగర, పార్వతీపురం మన్యం జిల్లా గరుగుబిల్లి, గుమ్మలక్ష్మీపురం, జియ్యమ్మవలస, కొమరాడ, సీతానగరం, పోలవరం జిల్లా ఎటపాక మండలాల్లో వడగాలులు ప్రభావం చూపుతాయని పేర్కొన్నారు. ఉపరితల ఆవర్తనం ప్రభావంతో బుధవారం ఉత్తరాంధ్ర జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన వర్షాలు కురిసేందుకు ఆస్కారముందన్నారు.