భారత్ న్యూస్ వరంగల్ …తెలంగాణకు వర్ష సూచన.. చల్లబడనున్న వాతావరణం!
Telangana weather update: తెలంగాణ ప్రజలకు వాతావరణ శాఖ చల్లని కబురు అందించింది. ఎండల తీవ్రతతో ఇబ్బంది పడుతున్న వారికి ఇది నిజంగా ఊరటనిచ్చే వార్త.
నైరుతి రుతుపవనాలు వేగం పుంజుకుని, మే 26 నాటికి కేరళ తీరాన్ని తాకనున్నాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. దీనివల్ల రానున్న రోజుల్లో రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు కురిసే అవకాశం ఉంది.

తెలంగాణలో తగ్గుతున్న ఎండల తీవ్రత
గత కొన్ని రోజులుగా రాష్ట్రంలో ఎండలు, వడగాలులు ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. అయితే ఇప్పుడు వాతావరణంలో మార్పులు చోటుచేసుకుంటున్నాయి. నైరుతి రుతుపవనాలు కేరళ చేరుకోగానే, అక్కడి నుండి అవి వేగంగా ముందుకు కదిలి జూన్ మొదటి వారంలోనే తెలంగాణను పలకరించే ఛాన్స్ ఉంది. ఈ మార్పుల వల్ల పగటి ఉష్ణోగ్రతలు తగ్గి, వాతావరణం చల్లబడనుంది.
మే 26 నుంచి 29 మధ్య రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు అధికారులు తెలిపారు. సాధారణంగా జూన్ ఆరంభంలో రావాల్సిన రుతుపవనాలు ముందుగానే రావడం వ్యవసాయ రంగానికి సానుకూల అంశం. ఖరీఫ్ సాగు పనులకు సిద్ధమవుతున్న రైతులకు ఈ వర్షాలు ఎంతో మేలు చేయనున్నాయి. రానున్న రోజుల్లో గాలిలో తేమ పెరిగి, ఉక్కపోత నుంచి ఉపశమనం లభించనుంది.