భారత్ న్యూస్ తిరుపతి…ద్వాదశ జ్యోతిర్లింగాలు……….!!
శైవులు శివున్ని మూర్తి రూపములో, లింగరూపములోనూ పూజిస్తారు. కానీ లింగ రూపమే అందులో ప్రధానమైనదిగా భావిస్తారు. ప్రతి లింగములో శివుని యొక్క జ్యోతి స్వరూపము వెలుగుతుంటుందని శైవుల నమ్మకం. అయితే వీటిలో ద్వాదశ జ్యోతిర్లింగాలు అని పిలువబడే పన్నెండు లింగాలు అత్యంత ముఖ్యమైనవిగా అనాది నుండి భావించబడుచున్నది.
అవి
1.సోమనాథుడు – విరవల్ రేవు, ప్రభాస్ పట్టణము, సౌరాష్ట్ర, కథియవార్, గుజరాత్ – దీనిని ప్రభాస క్షేత్రము అంటారు. చంద్రునిచే ఈ లింగము ప్రతిష్ఠింపబడినదని స్థలపురాణము.
2.మల్లికార్జునుడు – శ్రీశైలము, కర్నూలు జిల్లా, ఆంధ్రప్రదేశ్ – ఇక్కడ కృష్ణానది పాతాళగంగగా వర్ణింపబడింది. ఈ క్షేత్రము అష్టాదశ శక్తి పీఠములలో ఒక్కటి. ఆది శంకరాచార్యుడు శివానందలహరిని ఇక్కడే వ్రాశాడు. ఇక్కడ అమ్మవారు భ్రమరాంబాదేవి.
3.మహాకాళుడు – (అవంతి) ఉజ్జయిని, మధ్యప్రదేశ్ – క్షిప్రానది ఒడ్డున ఉంది. ఈ నగరములో 7 సాగర తీర్థములు, 28 తీర్థములు, 84 సిద్ధ లింగములు, 30 శివలింగములు, అష్టభైరవులు, ఏకాదశరుద్రులు, వందలాది దేవతా మందిరములు, జలకుండము ఉన్నాయి.
4.ఓంకారేశ్వరుడు, అమలేశ్వరుడు – మామలేశ్వరము, మధ్య ప్రదేశ్ – నర్మద (రేవా) నదీతీరమున వెలసెను. ఇక్కడ ఒకే లింగము రెండు బాగములుగా ఉండి, రెండు పేర్లతో పూజింపబడుతున్నది. అమ్మవారు అన్నపూర్ణ.
5.వైద్యనాథుడు (అమృతేశ్వరుడు) – పర్లి (కాంతిపూర్), దేవొగడ్ బీహార్ – బ్రహ్మ, వేణు, సరస్వతీ నదుల సమీపములో నున్నది. సహ్యాద్రి కొండల అంచునున్నది. అమృతమధనానంతరము ధన్వంతరిని, అమృతమును ఈ లింగములో దాచిరనీ, స్పృశించిన భక్తులకు అమృతము లభించుననీ నమ్మకము.

6.భీమశంకరుడు – డాకిని, భువనగిరి జిల్లా, పూనే వద్ద, మహారాష్ట్ర – చంద్రభాగ (భీమ) నది ఒడ్డున, భీమశంకర పర్వతములవద్ద – త్రిపురాపుర సంహారానంతరము మహాశివుడు విశ్రాంతి తీసికొన్న చోటు. అమ్మవారు కమలజాదేవి. శాకిని, ఢాకిని మందిరములు కూడా యున్నవి. మోక్ష కుండము, జ్ఙాన కుండము ఉన్నాయి.
7.రామేశ్వరుడు – రామేశ్వరము, తమిళనాడు – శ్రీరాముడు పరమశివుని అర్చించిన స్థలము – కాశీ గంగా జలమును రామేశ్వరమునకు తెచ్చి అర్చించిన తరువాత, మరల రామేశ్వరములోని ఇసుకను కాశీలో కలుపుట సంప్రదాయము. ఇక్కడ అమ్మవారు పర్వతవర్ధినీ దేవి.
8.నాగేశ్వరుడు (నాగనాథుడు)- (దారుకావనము) ద్వారక వద్ద, మహారాష్ట్ర – ఈ జ్యోతిర్లింగము ద్వారక, ఔధ్ గ్రామ్, ఆల్మోరా (ఉత్తరప్రదేశ్) అను మూడు స్థానములలో ఉన్నట్లు చెబుతారు.
9.విశ్వనాథుడు – వారణాసి, ఉత్తరప్రదేశ్ – కాశీ అని కూడా ప్రసిద్ధము – వరుణ, అసి నదులు గంగానదిలో కలిసే స్థానము – పరమపావన తీర్థము – ఇక్కడ అమ్మవారు అన్నపూర్ణేశ్వరి.
10.త్రయంబకేశ్వరుడు – నాసిక్, మహారాష్ట్ర – గౌతమీ తీరమున – ఇక్కడి లింగము చిన్న గుంటవలె కనిపించును, అందులో బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులప్రతీకగా మూడు చిన్న (బొటనవేలివంటి) లింగములున్నవి. అమ్మవారు కొల్హాంబిక. గంగాదేవి మందిరము కూడా ఉంది. కుశావర్త తీర్థము, గంగాద్వారా తీర్థము, వరాహ తీర్థము ముఖ్యమైనవి. 12 సంవత్సరములకొకమారు జరిగే సింహస్థపర్వము పెద్ద పండుగ.
11.కేదారేశ్వరుడు – హిమాలయాలలో, గర్ వాల్ జిల్లా, ఉత్తరప్రదేశ్ – మందాకినీ నదీ సమీపంలో- మంచుకారణంగా ఈ దేవాలయం సంవత్సరానికి ఆరు నెలలు మాత్రమే దర్శనమునకు తెరచి ఉంటుంది.
12.ఘృష్ణేశ్వరుడు (కుసుమేశ్వరుడు) – వెరుల్ నగర్, ఔరంగాబాదు ఎల్లోరా గుహల వద్ద, మహారాష్ట్ర.