చింతకోళ్ల వాసుల దాహం తీర్చిన ఎమ్మెల్యే బుద్ధప్రసాద్

భారత్ న్యూస్ రాజమండ్రి…చింతకోళ్ల వాసుల దాహం తీర్చిన ఎమ్మెల్యే బుద్ధప్రసాద్

త్రాగునీటి కొరత రాకుండా అధికారులు ప్రత్యేక శ్రద్ధ చూపాలని ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ ఆదేశాలు

కోడూరు: అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ చింతకోళ్ల వాసుల దాహం తీర్చారు. సోమవారం కోడూరు మండలం మందపాకల శివారు చింతకోళ్ల గ్రామాన్ని ఎమ్మెల్యే సందర్శించారు. గ్రామంలో త్రాగునీటి సరఫరాపై అధికారులతో మాట్లాడారు. మందపాకల త్రాగునీటి చెరువుకు ఫెన్సింగ్ వేయించాలని సూచించారు. ప్రత్యామ్నాయంగా ఉన్న కమ్మనమోల, ఇరాలి సీపీడబ్ల్యూ పథకం నుంచి కూడా త్రాగునీరు అందిస్తున్నామని అధికారులు తెలిపారు. త్రాగునీటి కొరత రాకుండా అధికారులు ప్రత్యేక శ్రద్ధ చూపాలని ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ ఆదేశించారు. వేసవి దృష్ట్యా ట్యాంకర్ ద్వారా త్రాగునీరు అందిస్తామని గ్రామస్థులకు హామీ ఇచ్చారు. కార్యక్రమంలో ఎంపీడీఓ సుధా ప్రవీణ్, డిప్యూటీ ఎంపీడీఓ బీ.కోటేశ్వరరావు, పంచాయతీ కార్యదర్శి సయ్యద్ సహానా పాల్గొన్నారు.

ట్యాంకర్ ద్వారా త్రాగునీరు సరఫరా:

ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ ఇచ్చిన మాటకు అనుగుణంగా చింతకోళ్ల ప్రజలకు మధ్యాహ్నమే ట్యాంకరుతో త్రాగునీరు అందచేశారు. ఎమ్మెల్యే సూచనలకు అనుగుణంగా జనసేన పార్టీ టౌన్ అధ్యక్షులు కోట రాంబాబు నాలుగు వేల లీటర్ల సామర్థ్యం కలిగిన వాటర్ ట్యాంకర్ ద్వారా రెండు రౌండ్లు త్రాగునీరు చింతకోళ్ల ప్రజలకు అందించారు. ఎమ్మెల్యే ఆదేశాల మేరకు వేసవి తీవ్రత తగ్గే వరకు ట్యాంకర్ ద్వారా త్రాగునీరు అందిస్తామని రాంబాబు తెలిపారు.