చల్లని కబురు వచ్చేసింది…కేరళలోకి నైరుతి రుతుపవనాలు

భారత్ న్యూస్ విశాఖపట్నం..చల్లని కబురు వచ్చేసింది…కేరళలోకి నైరుతి రుతుపవనాలు

మండుటెండలతో అల్లాడిపోతున్న ప్రజలకు ఉపశమనం కలిగించేలా చల్లని కబురు వచ్చేసింది. కేరళ, తమిళనాడులోకి నైరుతి రుతుపవనాలు ప్రవేశించాయి. దీంతో ఆయా తీర ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. వారం రోజుల్లోపే ఈ రుతుపవనాలు తెలంగాణలోకి ప్రవేశించనున్నాయి.

అయితే, గతంతో పోలిస్తే ఈసారి నైరుతి రుతుపవనాలు కాస్త ఆలస్యంగా కేరళలోకి ప్రవేశించాయి. వాస్తవానికి మే 26వ తేదీనే ఇవి కేరళ తీరాన్ని తాకే అవకాశం ఉందని తొలుత వాతావరణ విభాగం (ఐఎండీ) అంచనా వేసింది. కానీ, ఈసారి ఎల్న్ని ప్రభావంతో ఆ అంచనాలు తలకిందులయ్యాయి. కాగా.. రుతుపవనాల ప్రభావంతో ఇప్పటికే కేరళలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో అలప్పుళ, కొట్టాయం, ఎర్నాకుళం జిల్లాలకు వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. అటు, తమిళనాడులోని 15 జిల్లాల్లోనూ రానున్న కొన్ని గంటల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ హెచ్చరిక జారీ చేసింది.

ఇదిలాఉండగా.. ఎల్నినో ప్రభావంతో ఈ ఏడాది నైరుతి రుతుపవన కాలంలో (జూన్-సెప్టెంబరు) సాధారణం కంటే తక్కువ వర్షపాతమే నమోదవుతుందని వాతావరణ విభాగం అంచనా వేసింది. దీర్ఘకాల సగటుతో పోలిస్తే 90% వర్షమే ఈ సీజన్లో కురిసే అవకాశాలు ఉన్నాయని పేర్కొంది. పసిఫిక్ మహాసముద్ర ప్రాంతంలో ఎల్నినో పరిస్థితులు ఆవిర్భవిస్తున్నాయని, జూన్లో ఇవి బలహీనంగా ఉన్నా సెప్టెంబరులో మాత్రం బలంగా ఉండే అవకాశం ఉందని వివరించింది.