భారీగా ఆయుధాలు కొనుగోలు చేయనున్న భారత్… కేంద్రం గ్రీన్ సిగ్నల్.

భారత్ న్యూస్ ఢిల్లీ…..భారీగా ఆయుధాలు కొనుగోలు చేయనున్న భారత్… కేంద్రం గ్రీన్ సిగ్నల్

రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ అధ్యక్షతన జరిగిన డీఏసీ సమావేశం

రూ.79 వేల కోట్ల ఆయుధ కొనుగోళ్లకు డీఏసీ ఆమోదం

త్రివిధ దళాలకు ఆధునిక ఆయుధాలు, యాంటీ-డ్రోన్ వ్యవస్థలు

త్రివిధ దళాలకు సంబంధించిన సుమారు రూ.79 వేల కోట్ల విలువైన ఆయుధాలు, పరికరాల కొనుగోలు ప్రతిపాదనలకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అధ్యక్షతన సోమవారం జరిగిన రక్షణ సముపార్జన మండలి (డీఏసీ) సమావేశంలో ఈ మేరకు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.

ఈ ఒప్పందం ప్రకారం సైన్యానికి పలు కీలక ఆయుధ వ్యవస్థలు అందుబాటులోకి రానున్నాయి. శత్రు లక్ష్యాలపై అత్యంత కచ్చితమైన దాడులు చేయగల లోయిటర్ మునిషన్ వ్యవస్థను సైన్యం పొందనుంది. అలాగే తక్కువ ఎత్తులో, చిన్న పరిమాణంలో ప్రయాణించే శత్రు డ్రోన్‌లు, యూఏవీలను గుర్తించి ట్రాక్ చేసే తేలికపాటి లో లెవల్ రాడార్లను కూడా సమకూర్చనున్నారు. దీంతో యాంటీ – డ్రోన్ రక్షణ మరింత బలపడనుందని రక్షణ వర్గాలు పేర్కొంటున్నాయి.

నేవీకి సంబంధించిన ప్రతిపాదనలకూ డీఏసీ ఆమోదం తెలిపింది. ఈ ఒప్పందం కింద బొల్లార్డ్ పుల్ (బీపీ) టగ్‌లను నేవీకి అందించనున్నారు. ఇవి ఓడరేవుల్లో నావిగేషన్ సమయంలో, పరిమిత ప్రదేశాల్లో నౌకలు, జలాంతర్గాములను సురక్షితంగా నడిపించేందుకు సహాయపడతాయి. అదేవిధంగా హై-ఫ్రీక్వెన్సీ సాఫ్ట్‌వేర్ డిఫైన్డ్ రేడియో (హెచ్ఎఫ్ ఎస్‌డీఆర్) ద్వారా బోర్డింగ్, ల్యాండింగ్ కార్యకలాపాల సమయంలో సురక్షితమైన, దీర్ఘశ్రేణి కమ్యూనికేషన్ సామర్థ్యం మరింత మెరుగుపడనుంది.

వైమానిక దళానికి ఈ ఒప్పందం ప్రత్యేకంగా ప్రయోజనం చేకూర్చనుంది. అన్ని వాతావరణ పరిస్థితుల్లో టేకాఫ్, ల్యాండింగ్‌లను హై-డెఫినిషన్‌లో రికార్డ్ చేసే ఆటోమేటిక్ టేకాఫ్, ల్యాండింగ్ రికార్డింగ్ వ్యవస్థను వైమానిక దళం పొందనుంది. దీంతో విమాన భద్రత మరింత బలపడనుంది. అలాగే సుదూర శ్రేణిలో శత్రు విమానాలను గగనతలంలోనే కూల్చివేయగల ఆస్ట్రా ఎంకె -2 క్షిపణిని కూడా వైమానిక దళంలోకి చేర్చనున్నారు. అదనంగా స్పైస్ (ఎస్‌పైసీఇ-1000) మార్గదర్శక కిట్‌ను అందించడంతో లక్ష్యాలపై ఖచ్చితమైన దాడుల సామర్థ్యం పెరుగుతుందని రక్షణ వర్గాలు పేర్కొన్నాయి.