భారత్ న్యూస్ ఢిల్లీ…..ఆన్లైన్ బెట్టింగ్ పై సుప్రీంకోర్టు కొరడా…
జూదం మౌలిక హక్కు కాదు..
రమ్మీ..పోకర్ యాప్ లకు నో ఎంట్రీ ..
దేశవ్యాప్త నిషేధానికి దారి.. రాష్ట్రాలకే ఫుల్ పవర్స్..
ఆన్లైన్ గేమింగ్ బెట్టింగ్లపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. నైపుణ్యంతో కూడిన ఆటలైనా సరే.. డబ్బులు పెట్టి బెట్టింగ్ కాస్తే రాజ్యాంగ రక్షణ ఉండదని న్యాయస్థానం తేల్చిచెప్పింది. ఆన్లైన్ బెట్టింగ్లను నిషేధిస్తూ తమిళనాడు, కర్ణాటక ప్రభుత్వాలు చేసిన చట్టాలు పూర్తిగా చెల్లుతాయని స్పష్టం చేసింది. ఆన్లైన్ జూదాలను నిషేధించే పూర్తి అధికారం రాష్ట్ర ప్రభుత్వాలకే ఉంటుందని వెల్లడించింది. బెట్టింగ్ వ్యాపారం ఎవరికీ ‘మౌలిక హక్కు’ కాదని ధర్మాసనం తేల్చిచెప్పింది. దీంతో ఆన్లైన్ బెట్టింగ్ యాప్ల నిర్వాహకులకు, గేమింగ్ కంపెనీలకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది…
డబ్బులు పందెంపై..సుప్రీంకోర్టు తీవ్రంగా తప్పుపట్టింది
ఆన్లైన్ రమ్మీ, పోకర్ వంటి యాప్లలో డబ్బులు పందెంగా పెట్టడాన్ని సుప్రీంకోర్టు తీవ్రంగా తప్పుపట్టింది. గతంలో రాష్ట్ర ప్రభుత్వాల నిషేధ చట్టాలను కొట్టివేస్తూ మద్రాస్, కర్ణాటక హైకోర్టులు ఇచ్చిన తీర్పులను సుప్రీంకోర్టు సమర్థించింది. రాజ్యాంగం ప్రకారం బెట్టింగ్, జూదం అంశాలపై చట్టాలు చేసే సర్వాధికారాలు రాష్ట్రాలకే ఉన్నాయని స్పష్టం చేసింది. ఆట ఆడటానికి నైపుణ్యం అవసరమైనప్పటికీ, దానిపై డబ్బుల పందేలు కాస్తే అది జూదం కిందకే వస్తుందని న్యాయస్థానం తీర్పునిచ్చింది.
సామాజిక పరిస్థితులను సుప్రీంకోర్టు పరిగణనలోకి…

ఆన్లైన్ వ్యసనాల వల్ల యువత అప్పులపాలై, ఆత్మహత్యలు చేసుకుంటున్న సామాజిక పరిస్థితులను సుప్రీంకోర్టు పరిగణనలోకి తీసుకుంది. సమాజ హితం, శాంతిభద్రతల దృష్ట్యా ఆన్లైన్ గేమింగ్ ప్లాట్ఫారమ్లపై నిషేధం విధించడం సరైనదేనని న్యాయస్థానం సమర్థించింది. సుప్రీంకోర్టు తాజా తీర్పుతో దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లోనూ ఆన్లైన్ బెట్టింగ్ యాప్ల నిషేధానికి మార్గం సుగమమైంది. జస్టిస్ జేబీ పార్థీవాలా, జస్టిస్ ఆర్. మహాదేవన్లతో కూడిన ధర్మాసనం నుంచి ఈ చరిత్రాత్మక తీర్పు వెలువడింది.