నిషేధిత జంతువుల వధ, అక్రమ రవాణాపై కఠిన చర్యలు

.భారత్ న్యూస్ అమరావతి..నిషేధిత జంతువుల వధ, అక్రమ రవాణాపై కఠిన చర్యలు

  • బక్రీదు సందర్భంగా చట్టాలను పాటించాలి
  • జంతు హింసకు పాల్పడితే క్రిమినల్ కేసులు తప్పవు
  • మంత్రి కింజ‌రాపు అచ్చెన్నాయుడు హెచ్చ‌రిక‌

Ammiraju Udaya Shankar.sharma News Editor…అమరావతి, మే 27: బక్రీదు పండుగ సందర్భంగా జంతువుల వధ, రవాణా, సంరక్షణకు సంబంధించిన ప్రభుత్వ చట్టాలు, నియమ నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని రాష్ట్ర వ్య‌వ‌సాయ‌ పశుసంవర్ధక శాఖల‌ మంత్రి కింజ‌రాపు అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా జంతువుల రవాణా, సంరక్షణ , వధకు సంబంధించి ప్రత్యేక చట్టాలు అమలులో ఉన్నాయని, ఇవి జాతీయ స్థాయిలో రూపొందించబడినప్పటికీ, అనుమతులు , నిషేధాలు రాష్ట్రానికొక విధంగా ఉంటాయని మంత్రి తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాంసాహార అవసరాల కోసం మేకలు, గొర్రెలు, పందులు, కోళ్లు, బాతులు, చేపలు , పునరుత్పత్తికి వినియోగించని గేదెలను మాత్రమే వధించేందుకు అనుమతి ఉందన్నారు. అయితే ఆవులు, దూడలు , ఒంటెల వధను రాష్ట్రంలో పూర్తిగా నిషేధించినట్లు స్పష్టం చేశారు. పశువులను రవాణా చేసే సమయంలో వాటికి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా జంతు సంరక్షణ చట్టాలకు అనుగుణంగా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. పరిమితికి మించి వాహనాల్లో పశువులను తరలించడం, నిషేధిత జంతువులను వధించడం వంటి చర్యలు చట్టవిరుద్ధమని హెచ్చరించారు. ఎవరైనా ఆవులు, దూడలు, ఒంటెలను వధించినా లేదా నిబంధనలకు విరుద్ధంగా రవాణా చేసినా, జంతు హింస నివారణ చట్టం, ఆంధ్రప్రదేశ్ గోవధ నిషేధం , పశుసంరక్షణ చట్టం ప్రకారం కఠిన క్రిమినల్ చర్యలు తీసుకుంటామని మంత్రి అచ్చెన్నాయుడు హెచ్చరించారు. బక్రీదు సందర్భంగా క్షేత్రస్థాయిలోని పశువైద్య సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని, రెవెన్యూ, పోలీస్, మున్సిపల్, పంచాయతీరాజ్ శాఖలతో సమన్వయం చేసుకుని అనధికార పశువుల వధను అరికట్టాలని ఇప్పటికే అధికారులకు ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు. ఈ చట్టాలు, నిబంధనలకు సంబంధించిన పూర్తి వివరాల కోసం సమీప పోలీస్ అధికారులను సంప్రదించాలని ప్రజలకు సూచించారు. జంతు సంరక్షణ, గోవధ నిషేధ చట్టాలను ప్రతి ఒక్కరూ గౌరవించి, చట్టబద్ధంగా వ్యవహరించాలని రాష్ట్ర ప్రజలకు మంత్రి కింజ‌రాపు అచ్చెన్నాయుడు విజ్ఞప్తి చేశారు.