భారత్ న్యూస్ హైదరాబాద్….బంజారాహిల్స్లో కల్తీ నెయ్యి తయారీ కేంద్రంపై హైదరాబాద్ పోలీసుల దాడి
హైదరాబాద్ టాస్క్ ఫోర్స్ మరియు మాసబ్ ట్యాంక్ పోలీసులు సంయుక్తంగా నిర్వహించిన దాడిలో బంజారాహిల్స్లో “ప్రైడ్ డెయిరీ” పేరుతో నడుస్తున్న కల్తీ నెయ్యి తయారీ కేంద్రాన్ని బట్టబయలు చేశారు. యజమాని మొహమ్మద్ జునైద్ హుస్సేన్ను అరెస్ట్ చేసి, సుమారు ₹18.26 లక్షల విలువైన కల్తీ నెయ్యి మరియు తయారీ సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు.
పోలీసుల ప్రకారం తక్కువ నాణ్యత గల పామ్ ఆయిల్, వనస్పతి మరియు ఇతర పదార్థాలను ఆవు, గేదె మీగడలో కలిపి నకిలీ నెయ్యి తయారు చేస్తున్నట్లు గుర్తించారు. ఈ నెయ్యిని అసలైనదిగా చెప్పి ప్రజలకు, హోటళ్లకు మరియు శుభకార్యాల నిర్వాహకులకు విక్రయిస్తున్నట్లు వెల్లడించారు.

ఈ ఘటనపై మాసబ్ ట్యాంక్ పోలీస్ స్టేషన్లో భారతీయ న్యాయ సంహిత సెక్షన్లు 318(4), 274, 275 కింద కేసు నమోదు చేశారు. ఈ దాడి అడిషనల్ డీసీపీ అందె శ్రీనివాసరావు పర్యవేక్షణలో జరిగింది.