భారత్ న్యూస్ విజయవాడ.చేనేత’లకు సంక్రాంతి శుభవార్త
- సహకార సంఘాలకు రూ.5 కోట్ల బకాయిల విడుదలకు మంత్రి సవిత ఆదేశం
- బకాయిల చెల్లింపునకు ఆప్కో నిర్ణయం
- రేపు చేనేత సహకార సంఘాల ఖాతాల్లో రూ.5 కోట్ల బకాయిల జమ
- గత నెలలో రూ.2.42 కోట్ల బకాయిలను చెల్లించిన ఆప్కో
- సీఎం చంద్రబాబుకు, మం త్రి సవితకు ధన్యవాదాలు తెలిపిన చేనేత సహకార సంఘాల ప్రతినిధులు, నేతన్నలు

Ammiraju Udaya Shankar.sharma News Editor…అమరావతి : చేనేత సహకార సంఘాలకు రాష్ట్ర చేనేత, జౌళి శాఖ మంత్రి సవిత సంక్రాంతి ముంగిట శుభవార్త తెలిపారు. ఆప్కో బకాయిల్లో రూ.5 కోట్లు చెల్లించనున్నట్లు వెల్లడించారు. ఈ మేరకు ఆదివారం ఆమె ఒక ప్రకటన విడుదల చేశారు. గతంలో చేనేత సహకార సంఘాల నుంచి చేనేత వస్త్రాల కొనుగోలుకు సంబంధించి మరో విడత బకాయిలు విడుదల చేయనున్నట్లు తెలిపారు. గత నెలలో రూ.2.42 కోట్ల మేర బకాయిలను చేనేత సహకార సంఘాలకు చెల్లించామన్నారు. సంక్రాంతి పండగ దృష్ట్యా మరో రూ.5 కోట్లు చెల్లించాలని ఆప్కో యాజమాన్యాన్ని మంత్రి సవిత ఆదేశించారు. మంత్రి సవిత ఆదేశాల మేరకు సోమవారం చేనేత సహకార సంఘాల బ్యాంకు ఖాతాల్లో బకాయిలు జమ చేయడానికి ఆప్కో సిద్ధమైంది. చేనేత సహకార సంఘాల ఆర్థిక బలోపేతానికి కూటమి ప్రభుత్వం అధిక ప్రాధాన్యమిస్తోందని మంత్రి సవిత తెలిపారు. నేతన్నలకు వ్యక్తిగత లబ్ధి పొందేలా పలు సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామన్నారు. అదే సమయంలో సామూహికంగా చేనేత సహకార సంఘాల ద్వారా లబ్ధి కలిగేలా మరికొన్ని పథకాలు వర్తింపజేస్తున్నామన్నారు. చేనేత సహకార సంఘాలకు చెల్లించాల్సిన బకాయిలు చెల్లించడంతో పాటు నూతన కొనుగోళ్లను సైతం ప్రారంభించినట్లు మంత్రి సవిత తెలిపారు. నేతన్నలు గౌరవప్రదమైన జీవనం సాగించడంతో 365 రోజులూ వారికి ఉపాధి కల్పించాలన్నది సీఎం చంద్రబాబునాయుడి లక్ష్యమన్నారు. నేతన్నలకు సంక్షేమ పథకాలు అమలు చేస్తూనే…మరోవైపు చేనేత ఉత్పత్తులకు మార్కెటింగ్ సౌకర్యం కల్పిస్తున్నామన్నారు. చేనేత ఉత్పత్తుల విక్రయాల పెంపుదలకు కో ఆప్టెక్స్, టాటా తనేరియా, ఆద్యం బిర్లా గ్రూప్ తో ఒప్పందాలు చేసుకున్నామన్నారు. ముఖ్యంగా ఈ కామర్స్ లో దిగ్గజ సంస్థలైన ఫ్లిప్ కార్ట్, అమెజాన్, జియో మార్ట్, ఓఎన్డీసీ ద్వారా ఆన్ లైన్ లో చేనేత దుస్తుల అమ్మకాలను ప్రారంభించామన్నారు. నేటి తరం అభిరుచులకు అనుగుణంగా రెడీమేడ్ చేనేత వస్త్రాలను తయారు చేయించి, ఆప్కో షో రూమ్ లతో పాటు ఆన్ లైన్ లోనూ అమ్మకాలు చేస్తున్నామన్నారు నేతన్నలకు రెడీమేడ్ దుస్తుల తయారీపై శిక్షణ సైతం అందజేస్తున్నామన్నారు. కూటమి ప్రభుత్వం అందిస్తున్న సహకారంతో గతంలో ఎన్నడూ లేనివిధంగా చేనేత అమ్మకాలు ఊపందుకున్నాయని మంత్రి సవిత తెలిపారు. సంక్రాంతి ముంగిట రూ.5 కోట్ల బకాయిల చెల్లింపు చేయడంపై చేనేత సహకార సంఘాల ప్రతినిధులు, నేతన్నలు హర్షం వ్యక్తంచేస్తున్నారు. సీఎం చంద్రబాబుకు, మంత్రి సవితకు ధన్యవాదాలు తెలియజేశారు.

జారీచేసిన వారు : రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత మరియు జౌళి శాఖామాత్యుల వారి కార్యాలయం