భారత్ న్యూస్ తెలంగాణ జిల్లా …..మేడారం అభివృద్ధికి సంబంధించిన పనులు వంద రోజుల్లో పూర్తయ్యేలా ప్రణాళికలు రూపొందించాలని ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారు అధికారులను ఆదేశించారు. మేడారం, బాసర ఆలయాల అభివృద్ధిపై ముఖ్యమంత్రి గారు ఉన్నతస్థాయి సమావేశంలో సమీక్షించారు.
ఈ సందర్భంగా మేడారం, బాసర ఆలయాల అభివృద్ధికి సంబంధించిన మాస్టర్ ప్లాన్ను అధికారులు వివరించగా, మేడారం సమ్మక్క, సారలమ్మ మహా జాతర నాటికి భక్తులకు సౌకర్యంగా ఉండేలా ఆలయాన్ని అభివృద్ధి చేయాలని సూచించారు. మేడారం అభివృద్ధికి సంబంధించి పలు డిజైన్లను పరిశీలించిన ముఖ్యమంత్రి గారు వంద రోజుల్లో అభివృద్ధి పనులు పూర్తయ్యేలా ప్రణాళికలు ఉండాలని అన్నారు.
ప్రపంచంలో అతిపెద్ద గిరిజన పండుగకు సంబంధించి నిర్మాణాలు పూర్తిగా సహజ సిద్ధమైన రాతి కట్టడాలతో చారిత్రాత్మకంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. భక్తులకు సౌకర్యంగా ఉండేలా ఎంట్రీ, ఎగ్జిట్, పార్కింగ్ వసతులు అన్నీ సక్రమంగా ఉండాలని చెప్పారు.

భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని జంపన్న వాగులో నీరు నిలిచేలా ప్రాంతాల వారిగా చెక్ డ్యామ్ల నిర్మాణాలకు ప్రణాళికలు రూపొందించాలని అధికారులను ఆదేశించారు. ఈ వారంలో మేడారంకు వచ్చి క్షేత్రస్థాయి పరిశీలన చేస్తానని చెప్పారు.
దీనితో పాటు బాసర శ్రీ జ్ఞాన సరస్వతీ దేవాలయ విస్తరణ, అభివృద్ధికి సంబంధించిన ముఖ్యమంత్రి గారు పలు సూచనలు చేశారు. అన్ని దేవాలయాల అభివృద్ధికి సంబంధించి స్థానిక సెంటిమెంట్ను గౌరవించడంతోపాటు, స్థానిక నిపుణులు, పూజారుల అభిప్రాయాలు పరిగణనలోకి తీసుకోవాలని సూచించారు.
ఈ సమీక్షా సమావేశంలో మంత్రులు కొండా సురేఖ గారు, ధనసరి అనసూయ సీతక్క గారు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు, అడ్లూరి లక్ష్మణ్ కుమార్ గారు, సీఎం ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీనివాస రాజు గారు, దేవాదాయ శాఖ ముఖ్య కార్యదర్శి శైలజా రామయ్యర్ గారితో పాటు ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.