- ఈ సందర్భంగా దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ శ్రీ సంజయ్ కుమార్ శ్రీవాస్తవ త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించారు.
భారత్ న్యూస్ డిజిటల్;సికింద్రాబాద్:
‘ 77వ గణతంత్ర దినోత్సవాన్ని ఘనంగా జరుపుకున్న దక్షిణ మధ్య రైల్వే
• ఈ సందర్భంగా దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ శ్రీ సంజయ్ కుమార్ శ్రీవాస్తవ త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించారు.
దక్షిణ మధ్య రైల్వే 77 వ గణతంత్ర దినోత్సవాన్ని ఈరోజు అనగా జనవరి 26, 2026 న సికింద్రాబాద్లోని రైల్వే స్పోర్ట్స్ కాంప్లెక్స్ ప్రాంగణంలో జరుపుకుంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ శ్రీ సంజయ్ కుమార్ శ్రీవాస్తవ జాతీయ జెండాను ఆవిష్కరించి, రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ యొక్క వివిధ బృందాలు అందించిన గౌరవ వందనాన్ని స్వీకరించారు. ఈ సందర్భంగా రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (ఆర్.పి.ఎఫ్), సివిల్ డిఫెన్స్ మరియు స్కౌట్స్ & గైడ్స్కు ప్రాతినిధ్యం వహిస్తున్న పద్నాలుగు ప్లాటూన్లు మార్చ్ పాస్ట్లో పాల్గొని, జనరల్ మేనేజర్కు గ్రాండ్ సెల్యూట్ను అందజేశారు.
శ్రీ సంజయ్ కుమార్ శ్రీవాస్తవ 77వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా సందేశాన్ని అందజేస్తూ, రైల్వే సోదరులకు మరియు వారి కుటుంబ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు. మన రాజ్యాంగం అమలులోకి వచ్చిన ఈ రోజును మనం అద్వితీయంగా కీర్తిస్తున్న తరుణంలో, భిన్నత్వంలో ఏకత్వాన్ని చాటుతూ మన దేశాభివృద్ధికి సానుకూలంగా దోహదపడే బాధ్యతాయుతమైన పౌరులుగా ఉండాలని ఆయన ప్రతి ఒక్కరికీ పిలుపునిచ్చారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2025-26)లో దక్షిణ మధ్య రైల్వే పనితీరు గురించి మాట్లాడుతూ, ఈ కాలంలో ప్రయాణీకుల మరియు సరుకు రవాణా విభాగం రెండింటిలోనూ రికార్డు స్థాయి ప్రదర్శనలతో చరిత్ర సృష్టించబడిందని ఆయన పేర్కొన్నారు. ఈ జోన్ 2025 ఏప్రిల్ మరియు డిసెంబర్ మధ్య రూ. 15,579 కోట్ల స్థూల ఆదాయాన్ని నమోదు చేసిందని, గత ఆర్థిక సంవత్సరం ఇదే కాలంతో పోలిస్తే ఇది 4శాతం పెరిగిందని ఆయన అన్నారు. దక్షిణ మధ్య రైల్వే చరిత్రలో తొలిసారిగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో కేవలం 257 రోజుల అతి తక్కువ వ్యవధిలోనే సరుకు రవాణా 100 మిలియన్ టన్నుల మార్కును అధిగమించడం ఈ జోన్కు గర్వకారణమని అన్నారు.
భద్రతను పెంచే దిశలో భాగంగా , ట్రాక్ల నిర్వహణకు సంబంధించి ఈ ఆర్థిక సంవత్సరంలో డిసెంబర్ వరకు జోన్ 643 కిలోమీటర్ల ట్రాక్ పునరుద్ధరణను పూర్తి చేసిందని జనరల్ మేనేజర్ తెలియజేశారు. ట్రాక్ జోడింపు పరంగా , దక్షిణ మధ్య రైల్వే 30 కిలోమీటర్ల డబ్లింగ్, 115 కిలోమీటర్ల ట్రిప్లింగ్ మరియు 2 కిలోమీటర్ల బైపాస్ లైన్ను పూర్తి చేసిందని ఆయన తెలిపారు. అధిక రద్దీ ఉన్న మార్గాలలో సెక్షన్ సామర్థ్యాన్ని పెంచడానికి, మొత్తం 435 రూట్ కిలోమీటర్ల మేర ఆటోమేటిక్ బ్లాక్ సిగ్నలింగ్ వ్యవస్థను ప్రారంభించడం జరిగింది. ఇది మునుపెన్నడూ ఏ రైల్వే జోన్ కూడా సాధించనటువంటి అత్యధిక ప్రగతి అని ఆయన పేర్కొన్నారు.
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఏప్రిల్ నుండి డిసెంబర్ మధ్య కాలంలో ప్రయాణికుల సౌకర్యార్థం, 39 లిఫ్టులు మరియు 19 ఎస్కలేటర్లు ప్రారంభించారు దీనితో, జోన్ వ్యాప్తంగా మొత్తం 241 లిఫ్టులు మరియు 100 ఎస్కలేటర్లు ఏర్పాటుచేయడ్డాయని ఆయన పేర్కొన్నారు. జోన్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో, చర్లపల్లి నుండి ముజఫర్పూర్ మరియు తిరువనంతపురం స్టేషన్ల వైపు రెండు నూతన అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ రైళ్లను ప్రారంభించిందని ఆయన చెప్పారు. దక్షిణ మధ్య రైల్వే వర్క్షాప్లు ఈ ఆర్థిక సంవత్సరంలో డిసెంబర్ వరకు రికార్డు స్థాయి పనితీరును కొనసాగిస్తూ 2,340 కోచ్ల లక్ష్యాన్ని అధిగమించి 2,352 కోచ్ల పి.ఓ.ఎచ్ అవుట్వర్న్ నమోదుచేశాయని ఆయన తెలిపారు.
అనంతరం రైల్వే ఉద్యోగులు, రైల్వే పాఠశాల, కళాశాల విద్యార్థులచే దేశభక్తి గీతాలు, నృత్య ప్రదర్శనలు సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. ఆర్పీఎఫ్ డాగ్ స్క్వాడ్ ప్రదర్శించిన వివిధ విన్యాసాలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.
