రెండు తెలుగు రాష్ట్రాలను కలుపుతూ కృష్ణానదిపై ఐకానిక్ కేబుల్ వంతెన

భారత్ న్యూస్ విజయవాడ…రెండు తెలుగు రాష్ట్రాలను కలుపుతూ కృష్ణానదిపై ఐకానిక్ కేబుల్ వంతెన రూపుదిద్దుకోనుంది. ప్రపంచంలోనే రెండోసారి.. అలాగే దేశంలోనే తొలిసారిగా కృష్ణానదిపై తీగల వంతెన ఏర్పాటుకు వేగంగా అడుగులు పడుతున్నాయి. నంద్యాల జిల్లా సిద్ధేశ్వరం గుట్ట – నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపుర్ సమీపంలోని సోమశిల వరకూ ఈ ఐకానిక్ కేబుల్ బ్రిడ్జి నిర్మించనున్నారు. ఈ కేబుల్ వంతెన ఏర్పాటు కోసం ఇప్పటికే భూసేకరణ ప్రక్రియ పూర్తి అయ్యింది. టెండర్ల ప్రక్రియ కూడా ముగిసింది. ఇక పనులు ప్రారంభం కావడమే తరువాయి. అయితే 2026 జనవరి నుంచి కృష్ణానదిపై ఐకానిక్ కేబుల్ వంతెన పనులు ప్రారంభమవుతాయని అధికారులు అంచనా వేస్తున్నారు. మరోవైపు కల్వకుర్తి – జమ్మలమడుగు నేషనల్ హైవే (NH-167K) నిర్మాణంలో భాగంగా ఈ ఐకానిక్ కేబుల్ బ్రిడ్జి నిర్మిస్తున్నారు. ఇందుకోసం రూ.1.083 కోట్లు ఖర్చవుతుందని ప్రాథమికంగా అంచనా వేశారు.

కృష్ణా నది మీద సోమశిల- సిద్ధేశ్వరం గుట్టల మధ్యన 1.77 కిలోమీటర్ల పొడవుతో ఈ ఐకానిక్ కేబుల్ వంతెన ఏర్పాటు కానుంది. ఈ వంతెన అందుబాటులోకి వస్తే హైదరాబాద్.. తిరుపతి మధ్య ప్రయాణ దూరం తగ్గుతుంది. సుమారుగా 70 కిలోమీటర్ల మేరకు దూరం తగ్గుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. అలాగే శ్రీశైలం ప్రాజెక్టు ముంపు ప్రాంతాలవాసులకు మార్గం సుగమం అవుతుందని భావిస్తున్నారు. అలాగే దేశంలోనే తొలిసారిగా ఈ తరహాలో తీగల వంతెన ఏర్పాటు చేయనున్నారు. దీంతో ఇటు పర్యాటకంగానూ ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుందని అధికారులు చెప్తున్నారు. మొత్తంగా ఈ ప్రాజెక్టు పూర్తి అయ్యి ఐకానిక్ కేబుల్ వంతెన అందుబాటులోకి వస్తే ఒకే దెబ్బకు మూడు పిట్టలు అనేలా ఉంటుందని అధికారులు చెప్తున్నారు.