భారత్ న్యూస్ గుంటూరు….హిందూ దేవాలయాలకు రాయితీపై మైక్ సెట్, గొడుగులు, శేష వస్త్రం, రాతి మరియు పంచలోహ విగ్రహాలు: టిటిడి

Ammiraju Udaya Shankar.sharma News Editor…ప్రపంచ ప్రఖ్యాత హైందవ సంస్థ అయిన తిరుమల తిరుపతి దేవస్థానములు సనాతన హిందూ ధర్మప్రచారంలో భాగంగా హిందువుల ఆలయాలకు మైక్ సెట్, గొడుగులు, శేషవస్త్రం, రాతి మరియు పంచలోహ విగ్రహాలను రాయితీపై అందిస్తుంది.
నిబంధనలకు అనుగుణంగా డిడితో పాటు పూర్తి చేసిన దరఖాస్తులను కార్యనిర్వహణాధికారి, టిటిడి పరిపాలనా భవనం, కె.టి.రోడ్డు, తిరుపతి అనే చిరునామాకు పంపాలి. ఇతర వివరాలకు 0877-2264276 అనే నంబరులో సంప్రదించగలరు.
మైక్ సెట్:
- మైక్ సెట్ కొనుగోలుకు అయ్యే ఖర్చు రూ.25,000లలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన ఎస్ సి, ఎస్ టి లకు 90% రాయితీ మినహాయించి రూ.2,500/- డి.డి. తీసి పంపించాల్సి ఉంటుంది. ఇతరులకు 50% రాయితీ మినహాయించి రూ. 12,500/- చెల్లించాల్సి ఉంటుంది.
- ఇందుకోసం ఆలయ కమిటీ దరఖాస్తు పత్రం, సంబంధిత ప్రాంతంలోని తహశీల్దార్ / దేవాదాయశాఖ అసిస్టెంట్ కమిషనర్ నుండి సిఫార్సు లేఖ, ఆలయ ఫొటో, ఆలయ కరెంట్ బిల్లు, దరఖాస్తుదారు ఆధార్ కార్డును జత చేయాలి.
గొడుగులు :
హిందూ దేవాలయాలకు కేటగిరీలతో సంబంధం లేకుండా అర్హులైన దరఖాస్తుదారులకు రూ.14,500 విలువ చేసే గొడుగులను 50 % రాయితీతో రూ.7,250 లకే టిటిడి అందిస్తుంది.
- ఇందుకోసం ఆలయ కమిటీ దరఖాస్తు పత్రం, సంబంధిత ప్రాంతంలోని తహశీల్దార్ / దేవాదాయశాఖ అసిస్టెంట్ కమిషనర్ తో
సదరు శాఖ సిఫార్సు లేఖ, దరఖాస్తుదారు ఆధార్ కార్డ్, ఆలయ ఫొటోను జత చేసి దరఖాస్తు చేయాలి. సదరు పత్రాలతోపాటు రాయితీ మినహాయించి రూ. 7,250/- లకు డి.డిను జత చేసి పంపాలి.
శేష వస్త్రం :
హిందూ దేవాలయాలకు ఉచితంగా శేష వస్త్రాన్ని టిటిడి ఉచితంగా అందిస్తోంది. ఇందుకోసం ఆలయ అభ్యర్థన లేఖను కార్యనిర్వాణాధికారి, తిరుపతి పేరుతో దరఖాస్తు చేయాలి. సంబంధిత ప్రాంతంలోని తహశీల్దార్ / అసిస్టెంట్ కమిషనర్, ఎండోమెంట్ డిపార్ట్మెంట్ నుండి సిపార్సు లేఖ, దరఖాస్తు దారు ఆధార్ కార్డు, ఆలయ ఫోటోను జత చేయాలి.
రాతి & పంచలోహ విగ్రహాలు
శ్రీ వేంకటేశ్వర స్వామి, శ్రీ పద్మావతీ అమ్మవారి రాతి విగ్రహాలను 5 అడుగులు, అంతకంటే తక్కువ ఎత్తులో ఉన్న విగ్రహాలను ఉచితంగా అందిస్తారు. మిగిలిన దేవతా విగ్రహాలకు 75 శాతం సబ్సిడీపై కేవలం 25% ధరను చెల్లిస్తే వివిధ వర్గాల వారికి అందిస్తారు. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో ఎస్సీ ఎస్టీ వర్గాల వారికి ఉచితంగా రాతి విగ్రహాలను అందిస్తారు.
పంచలోహ విగ్రహాలను ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో ఎస్సీ ఎస్టీ వర్గాల వారికి 90% సబ్సిడీతో, ఇతర వర్గాల వారికి 75% సబ్సిడీతో అందిస్తారు.
- దేవతా మూర్తుల రాతి మరియు పంచలోహల విగ్రహాల పేర్లు, కొలతలతో కార్యనిర్వహణాధికారి, టిటిడి వారికి ఆలయ అభ్యర్థన లేఖ పంపించాలి.
- దరఖాస్తుదారులు ఖచ్చితంగా స్థానిక తహసీల్దార్ / అసిస్టెంట్ కమీషనర్ నుండి సదరు ఎండోమెంట్ శాఖ తాజా సిఫార్సు లేఖ, ఆలయ బ్లూ ఫ్రింట్ ను ఏ4 సైజ్ లో మరియు అవసరమైన విగ్రహాల డ్రాయింగ్ , ఒరిజినల్ ఆలయ ఫోటో, దరఖాస్తుదారు ఆధార్ కార్డును జత చేయాలి.
- ఎం.ఈ.వో లేదా డీఈవో లతో ఆమోదం పొందిన విద్యా సంస్థలకు సరస్వతీ దేవీ రాతి విగ్రహాన్ని 50% సబ్సిడీతో టిటిడి అందిస్తోంది.
– మఠాలు, ట్రస్ట్ లకు, ఆశ్రమాలకు వివిధ దేవతామూర్తుల విగ్రహాలను 50% రాయితీతో అందిస్తారు.

తి.తి.దే., ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.