హైదరాబాద్: బ‌డాబాబుల ఆక్ర‌మ‌ణ‌ల‌కు హైడ్రా చెక్.

భారత్ న్యూస్ డిజిటల్. హైదరాబాద్: బ‌డాబాబుల ఆక్ర‌మ‌ణ‌ల‌కు హైడ్రా చెక్
నెక్నాంపూర్‌లో 23.16ఎక‌రాల ప్ర‌భుత్వ భూమిని కాపాడిన హైడ్రా
రూ. 2500 వేల‌ కోట్ల విలువైన భూమి చుట్టూ హైడ్రా ఫెన్సింగ్‌

హైద‌రాబాద్‌, డిసెంబ‌ర్ 22:

ఐటీ కేంద్రంగా.. అత్యంత ఖ‌రీదైన నెక్నాంపూర్ ప్రాంతంలో 23.16 ఎక‌రాల ప్ర‌భుత్వ భూమిని హైడ్రా సోమ‌వారం కాపాడింది. రూ. 2500 కోట్ల‌కు పైగా విలువ ఉన్న భూమి చుట్టూ ఫెన్సింగ్ వేసి హైడ్రా బోర్డుల‌ను ఏర్పాటు చేసింది. ఈ ఆక్ర‌మ‌ణ‌ల వెనుక బ‌డాబాబుల కుట్ర‌ల‌ను హైడ్రా భ‌గ్నం చేసింది. సామాన్యుల‌ను ముందు పెట్టి.. భూమిని సొంతం చేసుకుని రూ. కోట్ల‌కు ప‌డ‌గ‌లెత్తేందుకు బ‌డాబాబులు చేసిన ప్ర‌య‌త్నాల‌కు హైడ్రా చెక్ పెట్టింది. రంగారెడ్డి జిల్లా గండిపేట మండ‌లం, నెక్నాంపూర్ విలేజ్ స‌ర్వే నంబ‌రు 20లో ఉన్న 23.16 ఎక‌రాల భూమి ఆక్ర‌మ‌ణ‌ల‌కు గురి అవుతోంద‌ని స్థానికులు ఇచ్చిన ఫిర్యాదు మేర‌కు హైడ్రా ఈ చ‌ర్య‌లు తీసుకుంది. హైడ్రా క‌మిష‌న‌ర్ శ్రీ ఏవీ రంగ‌నాథ్ గారి ఆదేశాల మేర‌కు.. రెవెన్యూ, మున్సిప‌ల్ అధికారులతో క్షేత్ర‌స్థాయిలో హైడ్రా లోతైన విచార‌ణ చేప‌ట్టింది. ప్ర‌భుత్వ భూమిగా నిర్ధారించుకున్న త‌ర్వాత ఆక్ర‌మ‌ణ‌లను హైడ్రా తొల‌గించింది. కొన్ని క‌ట్ట‌డాల‌ను ఇప్ప‌టికే నేల‌మ‌ట్టం చేయ‌గా.. సోమ‌వారం మ‌రి కొన్ని ప్ర‌హ‌రీలతో పాటు షెడ్డుల‌ను తొల‌గించి వెనువెంట‌నే 23.16 ఎక‌రాల ప్ర‌భుత్వ భూమి చుట్టూ హైడ్రా ఫెన్సింగ్ ఏర్పాటు చేసింది. అలాగే ప్ర‌భుత్వ భూమిగా పేర్కొంటూ హైడ్రా బోర్డుల‌ను నెల‌కొల్పింది.

  • బ‌డాబాబుల ఆక్ర‌మ‌ణ‌ల‌కు చెక్‌..
    ప్ర‌భుత్వ భూమి ఎక్క‌డ ఉంటే అక్క‌డ వాలిపోయి.. సామాన్యుల‌ను ముందుంచి క‌బ్జాల పర్వాన్ని న‌డిపించిన బ‌డాబాబుల ఆగ‌డాల‌కు హైడ్రా చెక్ పెట్టింది. రెవెన్యూ రికార్డుల ప్ర‌కారం పూర్తిగా ప్ర‌భుత్వ భూమి అయిన‌ప్ప‌టికీ.. పాకాల పోచ‌య్య ద‌గ్గ‌ర భూమిని కొన్న‌ట్టు మ‌హ్మ‌ద్ ఇబ్ర‌హీం అనే వ్య‌క్తి త‌ప్పుడు రికార్డుల‌ను సృష్టించారు. ఇలా కొన్నామ‌ని చెప్పిన భూమికి సంబంధించి పాసు బుక్కులు ఇప్పించాల‌ని కోర్టును ఆశ్ర‌యించ‌డం జ‌రిగింది. కోర్టు నుంచి వ‌చ్చిన ఆదేశాల‌తో రెవెన్యూ అధికారులు రంగంలోకి దిగారు. క్షేత్ర‌స్థాయిలో ప‌రిశీలించి ప్ర‌భుత్వ భూమిగా నిర్ధారించి ఇదే విష‌యాన్ని కోర్టుకు తెలియ‌జేశారు. ఎలానూ త‌న వ‌ద్ద కొన్న‌ట్టు మ‌హ్మ‌ద్ ఇబ్ర‌హీం నకిలీ రికార్డు సృష్టించ‌డంతో.. పోచయ్య కుటుంబం కూడా హ‌క్కుల‌కోసం పోరాడ‌డం ఇక్క‌డ గ‌మ‌నార్హం. ఈ తంతుపై మ‌హ్మ‌ద్ ఇబ్ర‌హీంపై రెవెన్యూ అధికారులు నార్సింగ్ పోలీసు స్టేష‌న్లో కేసు కూడా న‌మోదు చేశారు. 1975లో ఈ భూమిని పోచ‌య్య ద‌గ్గ‌ర నుంచి కొన్న‌ట్టు మ‌హ్మ‌ద్ ఇబ్ర‌హీం త‌ప్పుడు ప‌త్రాలు సృష్టిస్తే.. 2019లో పాకాల పోచయ్య కుటుంబ స‌భ్యులు అదే భూమి త‌మ‌దంటూ పోరాటం మొద‌లు పెట్ట‌డం కొస‌మెరుపు.
  • ఊపిరి పీల్చుకున్న‌ స్థానికులు
    వ్య‌వ‌స్థ‌ల‌ను మేనేజ్ చేసుకుంటూ కొట్టేద్దామ‌ని బ‌డాబాబులు చేసిన ప్ర‌య‌త్నాలకు హైడ్రా చెక్ పెట్టింది. సామాన్య‌ల‌ను ముందు పెట్టి బ‌డాబాబులు చేసే క‌బ్జా ప్ర‌య‌త్నాల‌కు హైడ్రా భ‌గ్నం చేసింది. అత్యంత విలువైన ప్ర‌భుత్వ భూమిని కాపాడిన హైడ్రాకు స్థానికులు ధ‌న్య‌వాదాలు తెలిపారు. నగర ప్రణాళిక నిబంధనల ప్రకారం.. ప్రణాళికాబద్ధ అభివృద్ధితో పాటు ఓపెన్ స్పేస్, గ్రీన్ జోన్లుగా ఈ స్థ‌లాల‌ను అభివృద్ధి చేయాల‌ని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. ప్ర‌భుత్వ భూమిని కాపాడిన హైడ్రా క‌మిష‌న‌ర్ శ్రీ ఏవీ రంగ‌నాథ్ గారికి కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు. హైడ్రా వంటి ప‌టిష్ట‌మైన వ్య‌వ‌స్థ‌ను తీసుకువ‌చ్చిన రాష్ట్ర ప్ర‌భుత్వాన్ని అభినందించారు.