భారత్ న్యూస్ డిజిటల్:హైదరాబాద్:
నీటి శుద్ధి కేంద్రాలు,పైప్ లైన్ నిర్మాణంపై ఎండీ అశోక్ రెడ్డి సమీక్ష
గోదావరి తాగునీటి సరఫరా పథకం ఫేజ్-2&3 ప్రాజెక్ట్ పనులను డిసెంబర్ 2027 నాటికి పూర్తి చేయాలని జలమండలి ఎండీ అశోక్ రెడ్డీ గారు అధికారులను ఆదేశించారు.
హైదరాబాద్ నగరానికి 20 టీఎంసీల అదనపు నీటిని తరలించడానికి, మూసీ పునరుజ్జీవనంకోసం జంట జలాశయాలను గోదావరి నీటితో నింపడానికి రూ. 7,360 కోట్ల వ్యయంతో ప్రాజెక్టు మాస్టర్ బ్యాలెన్సింగ్ రిజర్వాయర్, నీటి శుద్ది కేంద్రాల నిర్మాణ పనులు జలమండలి చేపట్టింది. ఈ పనులపై గురువారం ఖైరతాబాద్ లోని జలమండలి ప్రధాన కార్యాలయంలో ఉన్నతాధికారులు, నిర్మాణ సంస్థల ప్రతినిధులతో ఎండీ అశోక్ రెడ్డి సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా ఎండీ మాట్లాడుతూ… మల్లన్న సాగర్ నుంచి ఘన్ పూర్ వరకు.. అక్కడి నుంచి ఉస్మాన్ సాగర్ వరకు నిర్మించాల్సిన పైప్ లైన్ విస్తరణ పనులు, ఘన్ పూర్ వద్ద నిర్మించనున్న 80 మిలియన్ లీటర్ల మాస్టర్ బ్యాలెన్సింగ్ రిజర్వాయర్, ఘన్ పూర్, ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ ల వద్ద నిర్మించే నీటి శుద్ది కేద్రాల పనులలో వేగం పెంచాలని అధికారులను ఆదేశించారు. ఏకకాలంలో నీటి శుద్ది కేద్రాల నిర్మాణ పనులను, పైప్ లైన్ విస్తరణ పనులు, తదితర పనులను జరపాలన్నారు.
గోదావరి డ్రికింగ్ వాటర్ సప్లై పథకం ఫేజ్-1 కింద.. నగర ప్రజల నీటి అవసరాల కోసం ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి జలమండలి ఇప్పటికే 10 టీఎంసీల నీరు తరలిస్తోంది. తాజాగా పథకంలో రెండు దశల ద్వారా మల్లన్న సాగర్ రిజర్వాయర్ నుంచి మరో 20 టీఎంసీల నీరు వాడుకునే అవకాశం ఉంది. ఈ 20 టీఎంసీల్లో.. 17.5 టీఎంసీలు నగర ప్రజల తాగునీటి అవసరాలకు పోగా, మూసీ ప్రక్షాళనలో భాగంగా.. జంట జలాశయాలను పునరుజ్జీవనం చేసేందుకు మిగిలిన 2.5 టీఎంసీలను ఉపయోగించనున్నారు. ఈ ప్రాజెక్టు వల్ల రెండు లాభాలున్నాయి. ఒకటి హైదరాబాద్ ప్రజల దాహార్తి తీర్చడం, రెండోది.. మూసీ ప్రక్షాళన, జంట జలాశయాల పునరుజ్జీవం చెయ్యడం.
ఈ ప్రాజెక్టులో పంప్ హౌజ్ లు, సబ్ స్టేషన్లు, మల్లన్న సాగర్ నుంచి ఘన్ పూర్ వరకు 3000 ఎంఎం డయా భారీ పైపు లైన్ నిర్మించనున్నారు. అంతే కాకుండా ఘన్ పూర్, శామీర్ పేట్ వద్ద 1170 ఎంఎల్డీల సామర్థ్యంతో నీటి శుద్ధి కేంద్రాన్ని (డబ్ల్యూటీపీ) నిర్మించనున్నారు. ఘన్ పూర్ నుంచి ముత్తంగి వరకు పంపింగ్ మెయిన్ నిర్మాణంతో పాటు.. ఇతర పనులు చేపట్టనున్నారు. రెండేళ్లలో ఈ ప్రాజెక్టు నిర్మాణం పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. గోదావరి డ్రింకింగ్ వాటర్ సప్లై స్కీమ్ ఫేజ్ -2&3 ద్వారా 300 ఎంజీడీల నీరు సరఫరా చేస్తారు.

ఈ కార్యక్రమంలో ప్రాజెక్టు డైరెక్టర్ టీవీ శ్రీధర్, సీజీఎమ్ మహేష్ కుమార్ లతో పాటు, సంబంచిన అధికారులు, నిర్మాణ సంస్థ ప్రతినిధులు పాల్గొన్నారు.