భారత్ న్యూస్ తెలంగాణ జిల్లా….వరుసగా వర్షాలు, వరదలతో జంట జలాశయాల గేట్లు ఎత్తడం, మూసీకి వరద నీటి ప్రవాహం పెరగటంతో పరివాహక ప్రాంతాల్లో పరిస్థితిని ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారు ఎప్పటికప్పుడు అధికారులను అడిగి తెలుసుకున్నారు. మూసీ వెంట లోతట్టు ప్రాంతాల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, ముంపునకు గురయ్యే ప్రాంత ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని అధికారులను ఆదేశించారు. అవసరమైన చోట పునరావాసం కల్పించేందుకు ఏర్పాట్లు చేయాలని చెప్పారు.
అర్ధరాత్రి ఇమ్లిబన్ సమీపంలో ఎంజీబీఎస్ బస్టాండ్ చుట్టూ నీళ్లు రావటంతో అక్కడున్న ప్రయాణికులను సురక్షితంగా బయటకు తీసుకొచ్చేందుకు చేపట్టిన సహాయక చర్యలను ముఖ్యమంత్రి గారు స్వయంగా సమీక్షించారు. ఎప్పటికప్పుడు అధికారులతో ఫోన్లో మాట్లాడి ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా అక్కడి నుంచి బయటకు తీసుకు వచ్చే ఏర్పాట్లు చేశారు.
వివిధ ప్రాంతాల నుంచి ఎంజీబీఎస్కు వచ్చే బస్సులను ప్రత్యామ్నాయ మార్గాలకు మళ్లించాలని అధికారులను ఆదేశించారు. బతుకమ్మ, దసరా పండుగల వేళ వివిధ జిల్లాలకు వెళ్లే ప్రయాణికులు ఇబ్బంది పడకుండా ఆర్టీసీ విభాగం తగిన చర్యలు చేపట్టాలన్నారు.
వరుసగా రెండో రోజు కూడా హైదరాబాద్లో భారీ వర్ష సూచన ఉండటంతో పోలీస్, ట్రాఫిక్ హైడ్రా, జీహెచ్ఎంసీ, విద్యుత్తు విభాగాలన్నీ అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి గారు సూచించారు. నగరంలో నీరు నిలిచే ప్రాంతాలు, మూసీ ప్రమాదకరంగా ప్రవహించే ప్రాంతాల్లో అధికారులు ప్రజలను హెచ్చరించేలా బోర్డులు పెట్టాలని, అటు వైపు వాహనాలు, ప్రజలు వెళ్లకుండా దారి మళ్లించాలని సూచించారు.
