.భారత్ న్యూస్ హైదరాబాద్….ప్రైవేటు విద్యా సంస్థలకు ధీటుగా తెలంగాణలో ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయడానికి అనుగుణంగా ప్రీ ప్రైమరీ విద్యను అందించే విధానాన్ని అమలు చేయనున్నట్టు ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారు హిమాచల్ ప్రదేశ్ రాష్ట్ర విద్యా శాఖ మంత్రి శ్రీ రోహిత్ ఠాకూర్ గారి నేతృత్వంలోని ప్రతినిధి బృందానికి తెలిపారు.

Ammiraju Udaya Shankar.sharma News Editor…హిమాచల్ప్రదేశ్ రాష్ట్ర విద్యా శాఖ మంత్రి గారి నేతృత్వంలోని ప్రతినిధి బృందం డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రి గారిని మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా విద్యా రంగం పట్ల తీసుకుంటున్న చర్యలను ముఖ్యమంత్రి గారు వివరించారు.
జాతీయ విద్యా విధానం తరహాలోనే తెలంగాణలోనూ త్వరలోనే ప్రత్యేక విద్యా విధానం తీసుకురాబోతున్న విషయాన్ని తెలిపారు. విద్యా విధానం కోసం ఇప్పటికే ఒక ఉన్నతస్థాయి కమిటీని నియమించామని, త్వరలోనే ఆ పాలసీని అమలులోకి తీసుకొస్తామని చెప్పారు.
గ్రామీణ ప్రాంతాల్లో ప్రభుత్వ బడుల్లో ప్రీ ప్రైమరీ ప్రారంభించడమే కాకుండా పిల్లలను పాఠశాలలకు తీసుకెళ్లడానికి రవాణా సౌకర్యం కల్పించే ఆలోచన కూడా చేస్తున్నట్టు తెలిపారు.
రాష్ట్రంలోని ఐటీఐలను ఏటీసీలుగా తీర్చిదిద్దుతున్న వివరాలను, అలాగే ప్రతి నియోజకవర్గంలో ఏటీసీ సెంటర్ ఏర్పాటు చేస్తున్నట్టు చెప్పారు.
విద్యా రంగంలో సమూల మార్పుల్లో భాగంగా చేపడుతున్న సంస్కరణలతో పాటు యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ (YIIRS) ఏర్పాటు చేస్తున్న వివరాలను తెలిపారు. ప్రతి నియోజకవర్గంలో 200 కోట్ల రూపాయల వ్యయంతో 25 ఎకరాల సువిశాల విస్తీర్ణంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ విద్యార్థులకు ఒకేచోట మినీ యూనివర్సిటీ స్థాయిలో ఈ స్కూల్స్ను నిర్మిస్తున్నట్టు చెప్పారు.
ఏటీసీగా మార్చిన మల్లేపల్లి (ఐటీఐ)ని సందర్శించాలని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారు హిమాచల్ప్రదేశ్ మంత్రి గారికి సూచించారు. రాష్ట్రంలో నెలకొల్పుతున్న ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ నిర్మాణంపైన ఆసక్తి చూపించిన హిమాచల్ ప్రదేశ్ మంత్రి గారు అందుకు సంబంధించిన సమగ్ర వివరాలను అందించాలని కోరారు.

✅ ప్రభుత్వ రంగంలో విద్యా వ్యవస్థను పటిష్టపరచాలన్న ముఖ్యమంత్రి గారి విజన్ను రోహిత్ ఠాకూర్ గారు అభినందించారు. ఈ సమావేశంలో విద్యా శాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.