భారత్ న్యూస్ తెలంగాణ జిల్లా….చర్లపల్లి జైలు దేశానికి ఆదర్శం
ఖైదీల సంక్షేమంలో నెంబర్ వన్
ఖైదీలకు బీమా, కుటుంబ సభ్యులకు వడ్డీలేని రుణ సదుపాయం కల్పించడం అభిందనీయం
జైళ్ల శాఖ డీజీ సౌమ్య మిశ్రా విజన్ భేష్
కస్టడీ-కేర్-కరక్షన్ కు ఆచరణ రూపమిస్తున్న జైళ్ల శాఖ
ఖైదీల ఉత్పత్తులతో ప్రత్యేక మేళా నిర్వహించండి
కేంద్రం నుండి సంపూర్ణ సహకారం అందిస్తా
కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ వెల్లడి
చర్లపల్లి జైలును సందర్శించిన కేంద్ర మంత్రి
జైళ్లలో సంస్కరణలు, ఖైదీల సంక్షేమంపై పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చిన అధికారులు
విడుదలైన ఖైదీలకు ఉపాధి కల్పిస్తున్నట్లు వెల్లడి
మహిళా ఖైదీల పిల్లలను ప్రైవేట్ స్కూళ్లలో చదివిస్తున్నట్లు వివరణ
ఖైదీల సంక్షేమంలో చర్లపల్లి జైలులో చేపడుతున్న సంస్కరణలు దేశానికి ఆదర్శంగా నిలుస్తాయని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ వ్యాఖ్యానించారు. ఖైదీలకు బీమా సౌకర్యం కల్పించడంతోపాటు, వారి కుటుంబ సభ్యులకు వడ్డీలేకుండా రుణ సదుపాయం కల్పించడం అభిందనీయమన్నారు. మహిళా ఖైదీల పిల్లలను ప్రైవేట్ స్కూళ్లలో చదవిస్తూ ఫీజులను కూడా జైళ్ల శాఖ చెల్లించడం గొప్ప విషయమన్నారు. ఈ విషయంలో జైళ్ల శాఖ డీజీ సౌమ్య మిశ్రా విజన్ ను అభినందించకుండా ఉండలేమన్నారు. కస్టడీ-కేర్-కరక్షన్ కు సౌమ్య మిశ్రా నిజమైన ఆచరణ రూపమిస్తున్నారని చెప్పారు.
కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ ఈరోజు చర్లపల్లి జైలును సందర్శించారు. జైళ్ల శాఖ డీజీ సౌమ్య మిశ్రాతోపాటు ఆ శాఖ ఉన్నతాధికారులు కేంద్ర మంత్రికి ఘన స్వాగతం పలికారు. చర్లపల్లి జైలులో చేపట్టిన అభివ్రుద్ధి పనులను కేంద్ర మంత్రి పరిశీలించారు. ఖైదీల కోసం ఏర్పాటు చేసిన ఇండస్ట్రీలను, వారు తయారు చేస్తున్నఉత్పత్తులను అడిగి తెలుసుకున్నారు. గోశాలను సందర్శించారు. గోవులకు స్వయంగా తన చేతితో మేత తిన్పించారు. ఒక లేగ ఆవుకు ‘క్రిష్ణ’ అంటూ నామకరణం చేశారు. జైలు ఆవరణలో ఏర్పాటు చేసిన రిక్రియేషన్ క్లబ్, బంతి పూల వనాన్ని సందర్శించారు. తేనె టీగలతో తేనె ఏ విధంగా పడుతున్నారనే విషయాన్ని స్వయంగా తిలకించారు.
అనంతరం ఖైదీల కోసం జైళ్ల శాఖ చేపట్టిన సంస్కరణలను కేంద్ర మంత్రికి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా అధికారులు వివరించారు. 25 ఏళ్ల క్రితం చర్లపల్లి జైలును నిర్మించారని నాటి నుండి నేటి వరకు ఎన్నో అభివ్రుద్ధి కార్యక్రమాలు చేపట్టినట్లు తెలిపారు. కేంద్ర ప్రభుత్వం చర్లపల్లి జైలు అభివ్రుద్ధి కోసం ఇప్పటి వరకు రూ.11.60 కోట్లు మంజూరు చేయగా, రూ. 11.30 కోట్లు ఖర్చు చేసి వివిధ అభివ్రుద్ధి పనులను చేపట్టినట్లు పేర్కొన్నారు.
సౌమ్య మిశ్రా జైళ్ల శాఖ డీజీగా బాధ్యతలు చేపట్టిన తరువాత విప్లవాత్మకంగా సంస్కరణలు చేపట్టారన్నారు. ఖైదీల కుటుంబ సభ్యులకు వీడియో లింక్ ద్వారా తాము ఉన్న ప్రాంతాల నుండే మాట్లాడే (ములాఖత్) అవకాశాన్ని కల్పించినట్లు తెలిపారు. ఖైదీలకు బీమా సౌకర్యాన్ని వర్తింపజేసినట్లు పేర్కొన్నారు. ఖైదీలు చదువుకునేందుకు విస్త్రత అవకాశాలు కల్పించడంతోపాటు చదవు పూర్తయ్యాక డిగ్రీలు కూడా అందజేస్తున్నట్లు తెలిపారు. ఖైదీల ఆరోగ్యంపైనే ప్రత్యేక ద్రుష్టి సారించామని, నిష్ణాతులైన డాక్టర్లను నియమించినట్లు పేర్కొన్నారు. ప్రతి రోజు సగటున 150 మంది వైద్య పరీక్షలు చేయించుకుంటున్నారని, ప్రతి రోగికి ప్రత్యేక హెల్త్ ప్రొఫైల్ ను రూపొందించినట్లు వివరించారు. ఖైదీలకు ప్రతిరోజు యోగా, ధ్యానం, పీఈటీ నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
ఖైదీలకు స్కిల్ డెవలెప్ మెంట్ సెంటర్ ఏర్పాటు చేసి ప్రత్యేక శిక్షణ ఇచ్చి వివిధ రంగాల్లో ప్రత్యేకంగా ఉపాధి కల్పిస్తున్నట్లు తెలిపారు. ఖైదీలు విడుదలైన తరువాత పెట్రోలు బంకుల్లో ఉద్యోగాలు కల్పిస్తూ ప్రతి నెలా రూ.18 వేల చొప్పున కనీస వేతనాలు చెల్లిస్తున్నట్లు పేర్కొన్నారు. అట్లాగే జైళ్ల శాఖ సిబ్బంది సంక్షేమం, ఆరోగ్యం, క్రీడా విషయాల్లో ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు. క్రీడా పోటీల్లో తెలంగాణ జైళ్ల శాఖ అధికారులు అగ్రగామిగా నిలుస్తున్నారని తెలిపారు. జైళ్ల శాఖ అందిస్తున్న సేవలు, చేస్తున్న అభివ్రుద్ధికి గాను ప్రతిష్టాత్మకమైన స్కోడా అవార్డు వచ్చినట్లు వివరించారు.
ఖైదీల సంక్షేమం, చర్లపల్లి జైలు అభివ్రుద్ధి విషయంలో జైళ్ల శాఖ డీజే విజన్ అద్బుతమని కేంద్ర మంత్రి కొనియాడారు. ఇతర రాష్ట్రాల జైళ్ల శాఖలు సైతం చర్లపల్లి జైలును సందర్శించి సంస్కరణలు అమలు చేసేలా చర్యలు తీసుకుంటానని పేర్కొన్నారు. ఖైదీలు తయారు చేస్తున్న ఉత్పత్తులు నాణ్యమైనవిగా ఉన్నందున హైదరాబాద్ లో ‘ప్రత్యేకంగా మేళా’ నిర్వహించి ఆయా ఉత్పత్తులు ప్రజలకు అందించాలని సూచించారు. జైళ్ల శాఖకు కేంద్రం అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందించేందుకు సిద్ధంగా ఉన్నామని హామీ ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి బండి సంజయ్, జైళ్ల శాఖ డీజీ సౌమ్య మిశ్రా, చర్లపల్లి జైలు సూపరింటెండ్ శివకుమార్ గౌడ్ తదితర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.