భారత్ న్యూస్ తెలంగాణ జిల్లా.సీతక్క పట్టుదల – మేడారానికి కొత్త రూపం
తెలంగాణ కుంభమేళా మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర ప్రాంగణం అద్భుతమైన రీతిలో పునర్నిర్మాణం అవుతోంది. ఆదివాసీల సంస్కృతిని, కొయ్య దొరల వారసత్వాన్ని భావితరాలకు అందించేలా ఈ ఆలయ ప్రాంగణాన్ని తీర్చిదిద్దుతున్నారు. స్వయంగా అడవి బిడ్డ అయిన సీతక్క మేడారాన్ని అభివృద్ధి చేయాలని పట్టుదలగా ప్రయత్నించి.. పనులు చేయిస్తున్నారు. దాదాపుగా ప్రతి రోజూ ఆమె పనుల గురించి ఆరా తీస్తున్నారు. వేగంగా పూర్తయ్యేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
శరవేగంగా పనులు
మేడారం పునర్నిర్మాణంలో దాదాపు 4,000 టన్నులకు పైగా కృష్ణశిల వినియోగిస్తున్నారు. గద్దెల ప్రాంగణాన్ని 271 చదరపు మీటర్ల విస్తీర్ణంలో 46 భారీ స్తంభాలతో నిర్మిస్తున్నారు. ముఖ్యంగా భక్తులు దర్శించుకునే గద్దె చుట్టూ 8 ప్రత్యేక స్తంభాలను ఏర్పాటు చేసి, గద్దెల మధ్యలో వెదురు ఆకృతులను ఆదివాసీ సంప్రదాయం ఉట్టిపడేలా నిర్మిస్తున్నారు. ఈ ప్రాంగణంలో సుమారు 7,000 శిల్పాలు కొయ్య తెగ సంస్కృతిని, వారి వంశావళిని ప్రతిబింబిస్తాయి. ప్రాకార గోడలపై కొయ్యల చరిత్రను తెలిపే చిహ్నాలు, శిల్పాలను చెక్కుతున్నారు. ప్రధాన ప్రవేశ ద్వారం వద్దనే సమ్మక్క వంశానికి చెందిన 59 శిల్పాలను ప్రతిష్టించారు. మొత్తం మీద ఈ 7,000 శిల్పాలు దాదాపు 750 కొయ్య వంశాల పేర్లను సూచిస్తూ, ఒక సజీవ ఆదివాసీ విజ్ఞాన కేంద్రంగా ఈ ప్రాంగణం మారుతోంది.
ఆకర్షణీయంగా భారీ తోరణాలు
ఆలయానికి శోభనిచ్చేలా వివిధ పరిమాణాల్లో భారీ తోరణాలను నిర్మిస్తున్నారు. ఇందులో 50 అడుగుల ఎత్తు ఉన్న ఒక ప్రధాన తోరణం, 40 అడుగుల ఎత్తు ఉన్న మూడు తోరణాలు, 30 అడుగుల ఎత్తు ఉన్న ఐదు తోరణాలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. ఈ తోరణాలు భక్తులకు స్వాగతం పలకడమే కాకుండా, కాకతీయ ,ఆదివాసీ నిర్మాణ శైలుల కలయికను ప్రదర్శిస్తాయి.
ప్రాచీనత దెబ్బతినకుండా అభివృద్ధి పనులు

ఈ భారీ నిర్మాణాన్ని డాక్టర్ హరిప్రసాద్ నేతృత్వంలో 250 మంది నిపుణులైన శిల్పులు చెక్కుతున్నారు. ప్రముఖ పురావస్తు నిపుణులు ఈమని శివనాగిరెడ్డి, డాక్టర్ మోతీలాల్ పర్యవేక్షణలో ఈ పనులు జరుగుతున్నాయి. ఈ నిర్మాణ రూపకల్పనలో ,డాక్యుమెంటేషన్లో 15 మంది ఆర్కియాలజీ విద్యార్థులు క్రియాశీలకంగా పాల్గొని ప్రాచీనత దెబ్బతినకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అభివృద్ధి పేరుతో ప్రకృతిని విస్మరించకుండా, ప్రాంగణంలోని పాత చెట్లను అలాగే సంరక్షిస్తున్నారు. అదనంగా, 12 రకాల పవిత్ర అటవీ వృక్షాలు, దాదాపు 140 రకాల ఔషధ మొక్కలను నాటుతూ ఒక పవిత్ర వనాన్ని ఇక్కడ తీర్చిదిద్దుతున్నారు. ఇది భక్తులకు ఆధ్యాత్మిక అనుభూతిని అందించడమే కాకుండా, అడవి తల్లితో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేస్తుంది ఈ పునర్నిర్మాణ పనులు పూర్తయితే, మేడారం కేవలం ఒక జాతర ప్రదేశంగానే కాకుండా, ప్రపంచంలోనే అతిపెద్ద ‘ఆదివాసీ సాంస్కృతిక కేంద్రం’గా గుర్తింపు పొందుతుందని ప్రభుత్వం నమ్మకంగా ఉంది.