భారత్ న్యూస్ ఢిల్లీ…..ISRO: ఇస్రో ఖాతాలో మరో ఘనత.. అమెరికా బ్లూ బర్డ్ ఉపగ్రహాన్ని విజయవంతంగా నింగిలోకి పంపిన శాస్త్రవేత్తలు
భారతీయ అంతరిక్ష పరిశోధనా సంస్థ(ISRO) ఖాతాలో మరో ఘనత నమోదైంది. అమెరికాకు చెందిన ఏఎస్టీ స్పేస్ మొబైల్ సంస్థ, ఇస్రో వాణిజ్య విభాగం సంయుక్తంగా చేపట్టిన రాకెట్ ప్రయోగం విజయవంతమైంది. తొలిసారిగా ఇస్రో శాస్త్రవేత్తలు శ్రీహరికోటలోని సతీశ్ ధవన్ స్పేస్ సెంటర్-షార్ నుంచి అమెరికాకు చెందిన బ్లూ బర్డ్ బ్లాక్-2 అనే సుమారు 6,100 కిలోలు బరువుగల భారీ ఉపగ్రహాన్ని LVM-3 M6 అనే బాహుబలి రాకెట్ ద్వారా నింగిలోకి పంపిచారు. ఈ ప్రయోగాన్ని ఇస్రో శాత్తవేత్తలు కేవలం 15 నిమిషాల్లో విజయవంతం చేశారు.

నింగిలోకి దూసుకెళ్లిన LVM-3 M6 రాకెట్ నిర్దేశిత కక్ష్యలో 15.07 నిమిషాల్లో మూడు దశలు పూర్తి చేసుకొని ఎర్త్ ఆర్బిట్(లియో)లోకి బ్లాక్ బర్డ్ను ప్రవేశపెట్టింది. బుధవారం ఉదయం 8:54 గంటలకు శ్రీహరికోట నుంచి LVM-3 M6 రాకెట్ ప్రయోగాన్ని ఇస్రో చేపట్టింది.ఇస్రో చరిత్రలో లోనే ఇంత భారీ ఉపగ్రహాన్ని నింగిలోకి పంపడం ఇదే తొలిసారి అని తెలుస్తోంది. ఇక ప్రయోగం విజయవంతం కావడంతో శ్రీహరికోటలోని సతీశ్ ధవన్ స్పెస్ సెంటర్లో ఇస్రో శాస్త్రవేత్తలు సంభరాలు జరుపుకున్నారు.