ఆధార్‌లో మార్పులు ఇక సులభం,

భారత్ న్యూస్ ఢిల్లీ…ఆధార్‌లో మార్పులు ఇక సులభం

కొత్త మొబైల్ యాప్‌తో ఇంటి నుంచే అప్‌డేట్స్

న్యూఢిల్లీ:
ఆధార్ కార్డులో మార్పులు చేయాలనుకునే ప్రజలకు కేంద్ర ప్రభుత్వం మరింత సులభమైన విధానాన్ని అందుబాటులోకి తీసుకురానుంది. ఇకపై ఆధార్‌కు సంబంధించిన మార్పులు, అప్‌డేట్స్ అన్నీ కూడా ఇంటి నుంచే ఆన్‌లైన్‌లో చేసుకునేలా భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (UIDAI) సరికొత్త మొబైల్ అప్లికేషన్‌ను ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తోంది.

ఈ కొత్త యాప్ ద్వారా పేరు, చిరునామా, మొబైల్ నంబర్ వంటి వివరాల్లో మార్పులు చేసుకోవచ్చు. ఆధార్ కేంద్రాలకు వెళ్లి క్యూలో నిలబడాల్సిన అవసరం లేకుండా, మొబైల్ ద్వారానే అప్‌డేట్ అభ్యర్థనలు నమోదు చేసుకునే అవకాశం కల్పించనున్నారు. దీంతో ప్రజల సమయం, ఖర్చు రెండూ ఆదా కానున్నాయి.

అదేవిధంగా, ఆధార్ భద్రతను మరింత బలోపేతం చేయడానికి QR కోడ్ ఆధారిత డిజిటల్ ఆధార్ విధానాన్ని కూడా విస్తరించనున్నారు. ఈ విధానంతో ఆధార్ వివరాలు సురక్షితంగా ఉండడంతో పాటు, అవసరమైన చోట సులభంగా వినియోగించుకునే వీలు ఉంటుంది.

ఇక ప్రజలు స్వయంగా మార్పులు చేసుకునేందుకు ప్రత్యేకంగా రూపొందించిన సెల్ఫ్ సర్వీస్ అప్‌డేట్ పోర్టల్‌ను కూడా UIDAI అందుబాటులోకి తీసుకురానుంది. ఈ కొత్త వ్యవస్థల అమలుతో ఆధార్ అప్‌డేట్ ప్రక్రియ మరింత వేగంగా పూర్తి కానుండగా, ఆధార్ కేంద్రాల వద్ద ఉండే రద్దీ గణనీయంగా తగ్గనుందని అధికారులు తెలిపారు.