ఏఐ ఉద్యోగాల కంటే అదే పెద్ద సంక్షోభం: ఆనంద్‌ మహీంద్రా ట్వీట్

.భారత్ న్యూస్ హైదరాబాద్….ఏఐ ఉద్యోగాల కంటే అదే పెద్ద సంక్షోభం: ఆనంద్‌ మహీంద్రా ట్వీట్

నైపుణ్యం ఉన్న కార్మికుల కొరతే పెద్ద సమస్య అన్న మహీంద్రా

ఫోర్డ్ కంపెనీలో కోటి జీతంతో 5,000 మెకానిక్ పోస్టులు ఖాళీ

అమెరికాలో లక్షల సంఖ్యలో ఖాళీగా ప్లంబర్, ఎలక్ట్రీషియన్ ఉద్యోగాలు

ఏఐ యుగంలో నిజమైన విజేతలు నైపుణ్యం ఉన్న కార్మికులేనని వ్యాఖ్య

కృత్రిమ మేధ (ఏఐ) రాకతో వైట్ కాలర్ ఉద్యోగాలు కనుమరుగవుతాయనే ఆందోళన సర్వత్రా వ్యక్తమవుతోంది. అయితే, దీనికంటే పెద్ద సంక్షోభం మన ముందు ఉందని, దాన్ని మనం గుర్తించడం లేదని ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్‌ మహీంద్రా అన్నారు. నైపుణ్యం కలిగిన కార్మికుల కొరతే అసలైన సమస్య అని ఆయన తన ట్వీట్‌లో అభిప్రాయపడ్డారు.

అమెరికా ఆటోమొబైల్ దిగ్గజం ‘ఫోర్డ్’ సీఈవో జిమ్ ఫార్లే ఇటీవల ఓ పాడ్‌కాస్ట్‌లో చెప్పిన విషయాన్ని ఆయన ఉటంకించారు. ఫోర్డ్‌లో ప్రస్తుతం 5,000 మెకానిక్ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని, వాటిలో చాలా వాటికి వార్షిక వేతనం రూ. కోటి (1,20,000 డాలర్లు)కి పైగా ఉన్నప్పటికీ భర్తీ కావడం లేదని మహీంద్రా పేర్కొన్నారు. ఇది కేవలం ఫోర్డ్ కంపెనీకే పరిమితం కాదని, అమెరికా వ్యాప్తంగా ప్లంబింగ్, ఎలక్ట్రికల్, ట్రక్కింగ్ వంటి రంగాల్లో పది లక్షలకు పైగా ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని తెలిపారు.

దశాబ్దాలుగా మన సమాజం డిగ్రీలు, డెస్క్ ఉద్యోగాలకే అధిక ప్రాధాన్యత ఇచ్చిందని, నైపుణ్యం ఆధారిత శ్రామిక శక్తిని విస్మరించిందని మహీంద్రా విశ్లేషించారు. నైపుణ్యం, అనుభవం, నేర్పు అవసరమైన ఈ పనులను ఏఐ భర్తీ చేయలేదని స్పష్టం చేశారు.

ఈ ధోరణి ఇలాగే కొనసాగితే, భవిష్యత్తులో ప్రపంచాన్ని నిర్మించే, నడిపించే, మరమ్మతులు చేసే నైపుణ్యం ఉన్నవారే ‘ఏఐ యుగంలో’ అతిపెద్ద విజేతలుగా నిలుస్తారని ఆయన జోస్యం చెప్పారు. నైపుణ్యం, కొరత కారణంగా కార్మికులు ఉన్నత స్థాయికి ఎదుగుతారని, ఇది హింస ద్వారా కాకుండా నైపుణ్యం ద్వారా వచ్చే విప్లవమని కార్ల్ మార్క్స్ కూడా ఊహించి ఉండరంటూ తన పోస్ట్‌ను ముగించారు.