భారత్ న్యూస్ విజయవాడ…ఏప్రిల్. 07
విజయవాడ–కాజీపేట మధ్య అత్యంత కీలకమైన మూడో రైల్వే లైన్, విద్యుదీకరణ ప్రాజెక్ట్ పనులు శరవేగంగా తుది దశకు చేరుకుంటున్నాయి. దక్షిణ మధ్య రైల్వే నెట్వర్క్లో ఈ మార్గం అత్యంత రద్దీగా ఉండే ప్రాంతం కావడంతో, ఈ ప్రాజెక్ట్ పూర్తి కావడం రవా ణా వ్యవస్థలో ఒక మైలు రాయిగా నిలవనుంది. మొత్తం 219 కిలోమీటర్ల మేర విస్తరించి ఉన్న ఈ ప్రాజెక్టును భారత రైల్వే అత్యంత ప్రాధాన్యతతో చేపట్టింది.
తాజా సమాచారం ప్రకారం.. ఇప్పటికే 199 కిలోమీటర్ల మేర రైల్వే లైన్ , విద్యుదీకరణ పనులు విజయవంతంగా పూర్తయి, రైళ్ల రాకపోకలకు సిద్ధంగా ఉన్నాయి. మిగిలిన కొద్దిపాటి పనులు కూడా యుద్ధ ప్రాతిపదికన జరుగుతున్నాయి.ఈ మూడో రైల్వే లైన్ అందు బాటులోకి రావడం వల్ల ఎన్నో ప్రయోజనాలు చేకూరనున్నాయి.
ముఖ్యంగా విజయవాడ– కాజీపేట మధ్య నిరంతరం కొనసాగే రైళ్ల రద్దీ ఈ కొత్త లైన్ వల్ల గణనీయంగా తగ్గుతుంది. దీనివల్ల ప్రయాణీకుల రైళ్లు ఆలస్యం కాకుండా సమయానికి నడిచే అవకాశం ఉంటుంది. ఈ మార్గం ప్రధానంగా బొగ్గు, సిమెంట్ రవాణాకు కీలక కేంద్రం. మూడో లైన్ ద్వారా గూడ్స్ రైళ్ల రాకపోకలు వేగవంతమై, పరిశ్రమలకు అవసరమైన ముడి సరుకులు సకాలంలో చేరుతాయి.
అంతే కాకుండా.. ప్రాజెక్ట్లో భాగంగా జరిగిన పూర్తిస్థా యి విద్యుదీకరణ వల్ల ఇంధన ఖర్చులు తగ్గడమే కాకుండా, పర్యావరణహి తమైన రవాణా సాధ్యమవుతుంది.ఈ రైల్వే లైన్ అభివృద్ధి కేవలం రవాణా సౌకర్యాలకే పరిమితం కాకుండా.. ఆంధ్రప్రదేశ్ , తెలంగాణ రాష్ట్రాల మధ్య ఆర్థిక వారధిగా నిలవనుంది.
ఈ మార్గం వెంబడి ఉన్న పారిశ్రామిక ప్రాంతాలు, వ్యవసాయ మార్కెట్లు వేగంగా అభివృద్ధి చెందే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. దీని వల్ల స్థానిక వ్యాపారవేత్తలకు, కార్మికు లకు మెరుగైన అవకాశాలు లభిస్తాయి. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల నుంచి నగరాలకు కనెక్టివిటీ పెరగడం వల్ల ఉపాధి అవకాశాలు కూడా మెరుగుపడతాయి.

మొత్తానికి.. విజయవాడ– కాజీపేట మూడో లైన్ ప్రాజెక్ట్ పూర్తికావడం అనేది తెలుగు రాష్ట్రాల సమగ్ర అభివృద్ధిలో ఒక కీలక మలుపుగా మారనుంది.