భారత్ న్యూస్. మేడ్చెల్. మల్కాజ్ గిరి :
మేడ్చెల్ మల్కాజిగిరి జిల్లాలో వార్డు మెంబర్ల సహాకరంతో 18 ఏళ్లు నిండిన యువత కొత్తగా ఓటరు గుర్తింపు కార్డు నమోదు చేసుకునేలా పార్టీల ప్రతినిధులు చొరవ తీసుకోవాలని మేడ్చెల్ మల్కాజిగిరి జిల్లా అదనపు కలెక్టర్ విజయేందర్ రెడ్డి అన్నారు.
మంగళవారం మేడ్చెల్ మల్కాజిగిరి జిల్లా కలెక్టరేట్ విసి హాల్ లో డిఆర్ఓ హరిప్రియతో కలిసి అదనపు కలెక్టరు సమావేశమయ్యారు.ఈ సందర్భంగా పార్టీల ప్రతినిధులతో అదనపు కలెక్టరు మాట్లాడుతూ జిల్లా 18 ఏళ్లు నిండిన యువత శాతం ఎక్కువగా ఉన్నప్పటికి, ఓటరు నమోదు శాతం పెరగడం లేదని అన్నారు. ఇందుకు గాను వార్డు మెంబర్ల భాగస్వామ్యంతో యువత కొత్తగా ఓటరు గుర్తింపు కార్డు నమోదు చేసుకునేలా చూడాలని పార్టీ ప్రతినిధులను కోరారు. జిల్లాలో ఓటరు నమోదు శాతాన్ని పెంచాలన్నారు. భారత ప్రభుత్వ ఎన్నిక కమీషన్ సూచనల మేరకు జిల్లాలో ఓటర్లకు అనుకూలంగా ఉండేలా, 1500 మందికి ఒక పొలింగ్ బూతు ప్రకారం జిల్లాలో అదనంగా 38 పోలింగ్ బూతులను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. జిల్లాలో అదనంగా నియోజక వర్గాల వారిగా మేడ్చెల్ నందు 21, మల్కాజిగిరిలో 7, కుత్బుల్లాపూర్ లో 10 పోలింగ్ బూతులను ఏర్పాటు చేయడంతో, ప్రస్తుతం జిల్లాలో 2435 పోలింగ్ బూతులు ఉన్నాయన్నారు. ఓటర్లకు సమీపంగా, సౌకర్యవంతంగా ఉండేలా పరిశీలించి ఈబూతులను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. అదనంగా ఏర్పాటు చేసిన పోలింగ్ బూతుల నంబర్ల సవరింపులో కొన్ని బూతుల నంబర్లు మారుతాయని, బూతు పొలింగ్ అధికారులు ఈ మార్పు పై ఓటర్లకు అవగాహాన కల్పించాలని అదనపు కలెక్టరు తెలిపారు.
ఈ కార్యక్రమంలో కీసర ఆర్డిఓ ఉపేందర్ రెడ్డి, హెచ్ సెక్షన్ సూపరింటెండెంట్ రాజేశ్వర్ రెడ్డి, పార్టీల ప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.
