.భారత్ న్యూస్ హైదరాబాద్….అపోలో డాక్టర్ ప్రతాప్ సి.రెడ్డి వయసు 92
ఆస్తి రూ.70 వేల కోట్లు
92 ఏళ్ల వయసులో ఇప్పటికీ
ఆయన ఉదయం 10 గంటలకు ఆఫీస్ కు వెళ్తారు.
సాయంత్రం 5 వరకు పనిచేస్తారు.
ఆదివారం ఒక్కరోజు శెలవు తీసుకుంటారు.
అలా ఆయన హెల్త్ కేర్ రంగంలో
70వేల కోట్ల రూపాయల సామ్రాజ్యాన్ని స్థాపించారు.

చెన్నైలో పుట్టిన ప్రతాప్ రెడ్డి,
స్టాన్లీ కాలేజీలో మెడిసిన్ చదివారు.
తర్వాత అమెరికా వెళ్లి కార్డియాలజీ చేశారు.
అప్పట్లోనే డాక్టర్ అంటే విదేశాల్లో
ఎంత డిమాండ్ ఉంటుందో ఊహించుకోండి.
కానీ ఓ లేఖ,
ఓ ఘటన ఆయన జీవిత గమ్యాన్ని మార్చేశాయి.
డాక్టర్ చదివి ఈ దేశానికి సేవ చేయాలనేది
ప్రతాప్ రెడ్డి తండ్రిగారి కోరిక.
విదేశాల్లో చదువుకుంటున్నప్పుడు
ఈ కోరికను వెలుబుచ్చుతూ తండ్రి రాసిన లేఖ,
ప్రతాప్ రెడ్డిని కదిలించింది.
1970ల్లో ఆయన భారత్ కు వచ్చేశారు.
ఇండియా వచ్చిన తర్వాత
ఓ ఘటన ఆయనను కలచివేసింది.
ఇండియాలో పనిచేస్తున్న రోజుల్లో,
1979లో సరైన వైద్య సదుపాయాలులేక
తన కళ్ల ముందే ఓ రోగి చనిపోవడాన్ని
ప్రతాప రెడ్డి తట్టుకోలేకపోయారు.
ఆ రోగిని బతికించగలననే విషయం ఆయనకు తెలుసు,
కానీ సదుపాయాల్లేవు.
అప్పుడే ఆయన నిర్ణయం తీసుకున్నారు.
ఇండియాలోనే ప్రపంచస్థాయి వైద్యం అందించే
హాస్పిటల్ నిర్మించాలని డిసైడ్ అయ్యారు.
ఆ ఆలోచన నుంచి
పుట్టుకొచ్చిందే అపోలో హెల్త్ కేర్.
ప్రస్తుతం దేశవ్యాప్తంగా అపోలోకు
71 హాస్పిటల్స్ ఉన్నాయి.
5వేల ఫార్మసీలతో పాటు,
291 ప్రాధమిక సంరక్షణ కేంద్రాలున్నాయి.
వీటితో పాటు
డిజిటల్ హెల్త్ ఫ్లాట్ ఫామ్ కూడా నిర్వహిస్తోంది.
ఇప్పుడీ కంపెనీ మార్కెట్ విలువ 70వేల కోట్ల రూపాయలు.
డాక్టర్ ప్రతాప్ సి.రెడ్డి కుటుంబం
ఇందులో 29.3 శాతం మార్కెట్ షేర్ కలిగి ఉంది.
ఫోర్బ్స్ ప్రకారం, ప్రతాప్ సి.రెడ్డి వ్యక్తిగత
నికర ఆస్తుల విలువ 26,560 కోట్ల రూపాయలు.
ఈ నంబర్ ఆయనకిప్పుడు తృప్తినివ్వడం లేదు,
అపోలో సామ్రాజ్యం,
అందులో రోగులకు అందుతున్న
వైద్య సేవలు ఆయనకు సంతృప్తినిస్తున్నాయి.