
తమ జోలికి వస్తే తగిన గుణపాఠం చెబుతామని భారత్ ఇప్పుడే కాదు .. ఎప్పుడూ చెబుతూనే ఉంది. ఆపరేషన్ సిందూర్ పేరుతో ఉగ్రవాదులకు సరైన సమాధానం చెప్పింది. 9 ప్రాంతాల్లో గురి తప్పకుండా ఉగ్రస్థావరాలను బారత్ ధ్వంసం చేసింది. అయితే దాడులు చేయడం భారత్ కు కొత్తేమి కాదు. గతంలో కూడా భారత్ శత్రుదేశానికి చుక్కులు చూపించింది. ఇంతకీ భారత్ గతంలో ఎలాంటి దాడులు చేసింది..? ఎందుకు ఈ దాడులు చేయాల్సి వచ్చింది..? ఈ దాడులకు గత దాడులకు తేడా ఏంటి..?
తమపై దెబ్బ పడితే .. ఎదురుదెబ్బ ఎంత గట్టిగా ఉంటుందో భారత్ ఎప్పటి నుంచో చూపిస్తూనే ఉంది. ఇప్పటి ఆపరేషన్ సిందూరే కాదు గతంలో కూడా భారత్ పాకిస్థాన్ తో పాటు ఉగ్రవాదులకు భారత్ పంజా దెబ్బ రుచి చూపించింది. జమ్మూకశ్మీర్పై దశాబ్దాలుగా వివాదాన్ని కొనసాగిస్తున్న పాకిస్థాన్ .. సీమాంతర ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తూ భారత్పై ఉగ్రమూకలను ఉసిగొల్పుతున్న సంగతి తెలిసిందే.
వీటికి దీటుగా స్పందిస్తున్న భారత్.. ప్రతీకార దాడులతో బుద్ధిచెబుతున్నప్పటికీ దాయాది దేశం తీరు మారడం లేదు. ఇటీవల పహల్గాంలోనూ పర్యటకులపై దాడి తర్వాత.. ప్రతీకారంగా పాక్ ఉగ్ర స్థావరాలపై భారత్ విరుచుకుపడింది. ఆపరేషన్ సిందూర్ పేరుతో దాడిచేసి పదుల సంఖ్యలో ముష్కర మూకలను మట్టుపెట్టింది. అయితే ఇలాంటి దాడులు భారత్ కు కొత్త కాదు.. గత ఏడు దశాబ్దాల్లో పాక్పై భారత్ కీలక సైనిక ఆపరేషన్లు ఎన్నో చేపట్టింది.
ముందుగా పహల్గాంలో ఏప్రిల్ 22న అక్కడి పర్యటకులపై దాడి చేసిన ఉగ్రవాదులు.. దారుణంగా చంపేశారు. కన్నవారి, కట్టుకున్నవారి కళ్లముందే ప్రాణాలు తీసిన తీరు యావత్ ప్రపంచాన్ని కన్నీరు పెట్టించింది. దీనికి ప్రతీకారంగా ఆపరేషన్ సిందూర్ చేపట్టిన భారత్.. పాకిస్థాన్తో పాటు పాక్ ఆక్రమిత కశ్మీర్లోని మొత్తం తొమ్మిది ఉగ్ర స్థావరాలపై దాడులు చేసింది.
ఈ దాడుల్లో పదుల సంఖ్యలో ముష్కరులను భారత సైన్యం మట్టుపెట్టింది. పుల్వామాలో 2019 ఫిబ్రవరి 14న సీఆర్పీఎఫ్ సిబ్బందిపై దాడికి తెగబడిన ఉగ్రవాదులు.. 40 మంది సైనికులను పొట్టనపెట్టుకున్నారు. జైషే మహమ్మద్ ఈ దాడులు చేసినట్లు ప్రకటించుకుంది. దీనికి ప్రతీకారంగా బాలాకోట్లో జైషే ఉగ్ర స్థావరంపై ఫిబ్రవరి 26న భారత వాయుసేన వైమానిక దాడులు చేసింది. 1971 యుద్ధం తర్వాత పాకిస్థాన్ భూభాగంలోకి వెళ్లి దాడులు చేయడం అదే తొలిసారి. 2016 సెప్టెంబర్లో జమ్మూకశ్మీర్ ఉరిలోని భారత సైనిక స్థావరంపై మిలిటెంట్లు దాడులకు తెగబడి 19 మందిని చంపేశారు.
అనంతరం పది రోజుల తర్వాత వ్యూహాత్మకంగా స్పందించిన భారత సైన్యం.. పీవోకేలో ఉన్న ఉగ్ర స్థావరాలపై సర్జికల్ స్ట్రైక్స్ నిర్వహించింది. అనేక మంది ఉగ్రవాదులను అంతం చేసింది. సీమాంతర ఉగ్రవాదాన్ని అంతం చేయడంలో సరికొత్త పంథాను అనుసరిస్తున్నట్లు ఆ ఘటనతో భారత్ నిరూపించుకుంది. అయితే ఇవి మోదీ ప్రధానిగా ఉన్నప్పుడు జరిగిన ప్రతీకార దాడులు.. అంతకుముందు కూడా పాకిస్థాన్ కు భారత్ చాలా సార్లు బుద్ధి చెప్పింది.
1999లో జమ్మూకశ్మీర్ కార్గిల్ సెక్టార్లో పాక్సైన్యం అక్రమంగా చొరబడింది. దీంతో భారత్ ఆపరేషన్ విజయ్ ను చేపట్టింది. భారత్ వాయుసేన కూడా సైన్యానికి తోడ్పాటు అందించింది. భీకర యుద్ధంలో పైచేయి సాధించిన భారత్.. జులై నాటికి ఆ భూభాగాన్ని తిరిగి స్వాధీనం చేసుకుంది. అందుకే జులై 26ను కార్గిల్ విజయ్ దివస్గా నిర్వహించుకుంటున్నాం. లద్దాఖ్లోని సియాచిన్ గ్లేసియర్లో కీలక ప్రాంతాలను స్వాధీనం చేసుకునేందుకు ఆపరేషన్ మేఘ్దూత్ ను భారత్ చేపట్టింది. సాల్టోరో రిట్జ్పై పైచేయి సాధించిన భారత బలగాలు.. ఆ ప్రాంతంలో శాశ్వత స్థావరాన్ని ఏర్పాటు చేశాయి.
అత్యంత ఎత్తైన ప్రదేశంలోని ఆ యుద్ధభూమి భారత్కు ఓ వ్యూహాత్మక కేంద్రంగా మారింది. ఇప్పటికీ అక్కడ మన బలగాల గస్తీ ఉంటుంది. 1971లో తూర్పు పాకిస్థాన్లో హింసాత్మక ఘటనలు చోటుచేసుకుంటున్న వేళ.. భారత్పై పాకిస్థాన్ దాడులకు తెగబడింది. ఇది కాస్త ఇరుదేశాల మధ్య యుద్ధానికి దారితీసింది. అదే సమయంలో 1971 డిసెంబర్ 4న.. కరాచీ నౌకాశ్రయం లక్ష్యంగా భారత్ నౌకాదళం ఆపరేషన్ ట్రైడెంట్ చేపట్టింది. రంగంలోకి దిగిన భారత్ క్షిపణి బోట్లు.. ఊహించని రీతిలో పాక్ నౌకాదళ ఆస్తులు, ఇంధన నిల్వలను ధ్వంసం చేశాయి. ఆ యుద్ధంలో భారత్ నౌకాదళం ఆధిపత్యం కనబరచింది. చివరకు బంగ్లాదేశ్ ఏర్పాటుతో ఆ యుద్ధం ముగిసింది.
కశ్మీర్ను ఆక్రమించాలనుకునే ఉద్దేశంతో పాకిస్థాన్ సైన్యం 1965లో సైనిక చర్య చేపట్టింది. పాక్ సైనికులు, తిరుగుబాటు దారులు మారువేషంలో కశ్మీర్లోకి చొరబడేందుకు చేపట్టిన కోవర్ట్ ఆపరేషన్ ఇది. దానికి ఆపరేషన్ జిబ్రాల్టర్ పేరు పెట్టారు. దీనిని భారత్ సైన్యం దీటుగా తిప్పికొట్టింది. ఇరువైపులా భారీగా ప్రాణనష్టం జరిగింది. భారత్-పాక్ మధ్య రెండో అతిపెద్ద యుద్ధానికి దారితీసింది. ఐరాస నిర్దేశించిన కాల్పుల విరమణ, 1966లో తాష్కెంట్ ఒప్పందంపై సంతకాలు చేయడంతో ఆ ఘర్షణకు ముగింపు పడింది. అంతకుముందు భారత్-పాక్లు స్వాతంత్ర్యం పొందిన కొన్ని నెలలకే ఇరుదేశాల మధ్య ఘర్షణ ఏర్పడింది. దీనినే మొదటి కశ్మీర్ యుద్ధంగా పేర్కొంటారు. పాకిస్థాన్ మద్దతున్న ట్రైబల్ మిలీషియా దళాలు కశ్మీర్ను ఆక్రమించాయి.
అప్పుడు అక్కడి మహారాజు భారత్లో చేరడానికి సంసిద్ధత వ్యక్తం చేశారు. దీంతో ఆ ప్రాంతాన్ని రక్షించేందుకు భారత్ బలగాలను అక్కడికి పంపించడంతో ఇరుదేశాల మధ్య యుద్ధం మొదలైంది. 1948 వరకు ఇది కొనసాగింది. ఐరాస జోక్యంతో ఇరుదేశాలు కాల్పులు విరమించాయి. జమ్మూకశ్మీర్లో మూడింట రెండొంతుల భూభాగం భారత్ స్వాధీనం చేసుకోగా.. మిగతా భాగం పాక్ నియంత్రణలో ఉండిపోయింది. దాన్నే పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్ గా పేర్కొంటున్నాం. అయితే పీవోకేలో ఉగ్రవాద స్థావరాలను ఏర్పాటు చేసి.. మన దేశంలో దాడులు చేస్తున్న ముష్కరులకు భారత్ ఎప్పటికప్పుడూ గుణపాఠం చెబుతూనే ఉంది.