క్యాన్స‌ర్ బారిన ప‌డిన వ్య‌క్తి చికిత్స‌కు అవ‌స‌ర‌మైన ఆర్థిక స‌హాయం అందించి.రేవంత్ రెడ్డి గారు

..భారత్ న్యూస్ హైదరాబాద్….క్యాన్స‌ర్ బారిన ప‌డిన వ్య‌క్తి చికిత్స‌కు అవ‌స‌ర‌మైన ఆర్థిక స‌హాయం అందించి బాధిత‌ కుటుంబానికి ముఖ్య‌మంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు అండ‌గా నిలిచారు. సిద్దిపేటకు చెందిన సిరిసిల్ల సాయిచ‌ర‌ణ్ (35) అక్యూట్ మైలాయిడ్ లుకేమియా (బ్ల‌డ్ క్యాన్స‌ర్‌) బారిన ప‌డ్డారు. ఆయ‌న‌కు భార్య లక్ష్మిప్ర‌స‌న్న‌, కుమార్తెలు ల‌క్ష్మి సుస‌జ్ఞ (6), స్మ‌య (2 నెల‌లు), త‌ల్లిదండ్రులు రాము, సునీత ఉన్నారు.

ఇంటికి ఆధార‌మైన సాయిచ‌ర‌ణ్ క్యాన్స‌ర్ బారిన‌ప‌డ‌డంతో అత‌ని చికిత్సకు కుటుంబ స‌భ్యులు సిద్దిపేట మండ‌లం ఎన్సాన్‌ప‌ల్లిలోని త‌మ ఇంటిని విక్రయించారు. అయిన‌ప్ప‌టికీ చికిత్స‌కు అవ‌స‌ర‌మైనంత డ‌బ్బులు స‌రిపోక‌పోవ‌డంతో అప్పట్లో వారు ముఖ్య‌మంత్రి గారిని క‌లిసి త‌మ ఇబ్బందుల‌ను చెప్పుకున్నారు.

వెంటనే స్పందించిన ముఖ్య‌మంత్రి గారు సాయిచ‌ర‌ణ్ చికిత్స‌కు రూ.5 ల‌క్ష‌లు మంజూరు చేశారు. దాంతో హైద‌రాబాద్ బ‌స‌వ‌తార‌కం క్యాన్స‌ర్ ఆసుప‌త్రిలో సాయిచ‌ర‌ణ్‌కు స్టెమ్‌సెల్ ట్రాన్స్‌ప్లాంటేష‌న్ పూర్త‌యింది. చికిత్స‌కు అద‌నంగా వ్య‌య‌మైన మ‌రో రూ.7 ల‌క్ష‌ల‌ను CMRF ద్వారా అందించాల‌ని ముఖ్య‌మంత్రి గారు ఆదేశించ‌డంతో ఆ మొత్తాన్ని అధికారులు అంద‌జేశారు.

చికిత్స చేయించుకున్న సాయిచ‌ర‌ణ్ కుటుంబ స‌భ్యుల‌తో క‌లిసి రాష్ట్ర స‌చివాల‌యానికి వ‌చ్చి ముఖ్య‌మంత్రి గారిని క‌లిసి కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు. ధైర్యంగా ఉండాల‌ని ముఖ్యమంత్రి గారు వారి భుజం తట్టారు.