భారత్ న్యూస్ అమరావతి..మెషిన్‌ లెర్నింగ్‌కు ఫిజిక్స్‌ నోబెల్‌
జూజాన్‌ హోప్‌ఫీల్డ్‌, జెఫ్రీ హింటన్‌కు ప్రతిష్ఠాత్మక అవార్డు
కృత్రిమ నాడీవ్యవస్థతో మెషిన్‌ లెర్నింగ్‌ ఆవిష్కరణకు పట్టం
మెషీన్‌ లెర్నింగ్‌కు భౌతిక శాస్త్ర నోబెల్‌
భౌతికశాస్త్రంలో ఈ ఏడాది నోబెల్‌ బహుమతి జాన్‌ హోప్‌ఫీల్డ్‌, జెఫ్రీ హింటన్‌లను వరించింది. కృత్రిమ నాడీ వ్యవస్థలతో మెషీన్‌ లెర్నింగ్‌ను సాధ్యం చేసేలా వీరిద్దరూ సిద్ధాంతపరమైన ఆవిష్కరణలకు రూపకల్పన చేశారు. ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ (ఏఐ)ను మరింత అభివృద్ధి చేసే దిశగా చేసిన కృషికిగానూ వీరిద్దరినీ నోబెల్‌ బహుమతికి ఎంపిక చేసినట్టు స్టాక్‌హోంలోని నోబెల్‌ కమిటీ మంగళవారం వెల్లడించింది. ఏఐ గాడ్‌ఫాదర్‌గా పేరొందిన హింటన్‌.. టొరంటో వర్సిటీలో పనిచేస్తున్నారు.
ఆయనకు కెనడా, బ్రిటన్‌ పౌరసత్వం ఉంది. ఇక అమెరికాకు చెందిన హోప్‌ఫీల్డ్‌ న్యూజెర్సీలోని ప్రిన్స్‌టన్‌ వర్సిటీలో పనిచేస్తున్నారు. నాడీ వ్యవస్థపై ఈయన పరిశోధనలు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపుపొందాయి. వీరిద్దరూ అభివృద్ధి చేసిన మెషీన్‌ లెర్నింగ్‌ వ్యవస్థ హోప్‌ఫీల్డ్‌ నెట్‌వర్క్‌గా ప్రసిద్ధి చెందింది. హోప్‌ఫీల్డ్‌.. సమాచారాన్ని నిల్వ చేయగల, పునర్నిర్మించగల సామర్థ్యం కలిగిన ఒక ఫ్రేమ్‌వర్క్‌ను సృష్టించారు. హింటన్‌.. డేటాలోని లక్షణాలను సొంతంగా గుర్తించగల పద్ధతిని కనుగొన్నారు. భౌతికశాస్త్రంలో ఆర్టిఫిషియల్‌ న్యూర ల్‌ నెట్‌వర్క్‌ను అనేక రకాలుగా ఉపయోగిస్తారని, కొత్త పదార్థాలను అభివృద్ధి చేయడానికి వీరి పరిశోధనలు తోడ్పడతాయని నోబెల్‌ కమిటీ హెడ్‌ ఎలన్‌ మూర్స్‌ తెలిపారు.