భారత్ న్యూస్ అమరావతి..పాపికొండలు: ప్రకృతి ఒడిలో పరవశించండి.. పర్యాటకులకు అదిరిపోయే.. అవకాశం .. పాపికొండలు విహారయాత్ర ప్రారంభం..

దీపావళి సెలవులకు ముందు పాపికొండల విహార యాత్ర మళ్లీ ప్రారంభమైంది. అల్లూరి జిల్లా దేవీపట్నం మండలంలో పాపికొండలు విహారయాత్ర మొదలైంది. దాంతో.. గండిపోచమ్మ బోట్ పాయింట్ నుండి పాపికొండలు పర్యటనకు వెళ్లారు పలువురు టూరిస్టులు. నాలుగు నెలల తర్వాత మళ్ళీ పాపికొండలు విహారయాత్ర స్టార్ట్‌ కావడంతో వివిధ ప్రాంతాల నుండి వచ్చిన పర్యాటకులు కావేరి బోట్‌లో షికార్లు చేశారు. కుటుంబ సభ్యులు, స్నేహితుల సందడి మధ్య తొలిరోజు పాపికొండల విహారయాత్ర కొనసాగించారు టూరిస్టులు. పర్యాటకులు తరలిరావడంతో గండిపోచమ్మ పరివాహక ప్రాంతంలో సందడి వాతావరణం నెలకొంది. తొలి రోజు 41 మందితో కావేరి బోట్ పాపికొండలు విహారయాత్రకు వెళ్లింది.

లైఫ్ జాకెట్లతో పాటు ప్రత్యేక తనిఖీలు తర్వాత బోట్‌కు అనుమతిచ్చారు పర్యాటక శాఖ అధికారులు. నాలుగు నెలల తర్వాత పాపికొండల విహారయాత్ర ప్రారంభమవడంతో ఇకపై పర్యాటకుల తాకిడి పెరగనుంది. ఈ క్రమంలోనే.. పాపికొండలు పర్యటనకు 15 బోట్లకు ఫిట్నెస్, లైసెన్స్‌ ఇచ్చారు పర్యాటక శాఖ అధికారులు. గండిపోచమ్మ ఆలయం నుంచి పేరంటాలపల్లి వరకు విహారయాత్ర కొనసాగుతుంది.

ఫిర్యాదులు వస్తే కఠిన చర్యలు..
పాపికొండల టూర్‌కు అనుమతి ఇవ్వడంతో సబ్ కలెక్టర్ కల్పశ్రీతోపాటు స్థానిక అధికారులు బోట్లను పరిశీలించారు. బోట్ల ఫిట్‌నెస్‌, లైసెన్స్‌ రికార్డులను వెరిఫై చేసి.. బోటులో గోదావరిలో షికారు చేశారు సబ్ కలెక్టర్ కల్పశ్రీ. ఈ సందర్భంగా.. టూర్‌కు వెళ్ళే సమయంలో ప్రమాదం జరిగితే తీసుకోవాల్సిన చర్యలుపై ఎన్డీఆర్ఎఫ్ బలగాలతో మాక్ డ్రిల్ నిర్వహించారు. పాపికొండల టూర్‌కు వచ్చే పర్యాటకులకు ఎలాంటి అసౌకర్యాలు కలుగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని బోట్ల యజమానులకు సూచించారు. ,,